KCR condolences on Shibu Soren: శిబూసోరెన్ మృతి జాతీయ ఫెడరల్ రాజకీయాలకు తీరని లోటు
ABN , Publish Date - Aug 04 , 2025 | 11:58 AM
శిబూసోరెన్ ఆత్మకు శాంతి చేకూరాలని మాజీ సీఎం కేసీఆర్ ప్రార్థించారు. తండ్రిని కోల్పోయి దు:ఖసంద్రంలో మునిగిన వారి కుమారుడు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కు, వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
సిద్దిపేట: జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) అధినేత, మాజీ ముఖ్యమంత్రి, శిబూసోరెన్ (Shibu Soren) మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కల్వకంట్ల చంద్రశేఖర్ రావు (KCR) సంతాపం వ్యక్తం చేశారు. ఆదివాసీల హక్కుల కోసం , ప్రాంతీయ ఆస్తిత్వం కోసం శిబూసోరెన్ చేసిన పోరాటం.. తెలంగాణ రాష్ట్ర సాధనకు స్ఫూర్తి అని కొనియాడారు. శిబూసోరెన్ మరణం దేశ అస్తిత్వ, జాతీయ ఫెడరల్ రాజకీయాలకు తీరని లోటని కీర్తించారు. శిబూసోరెన్ మరణం జార్ఖండ్, తెలంగాణ వంటి దేశ ప్రాంతీయ అస్తిత్వ రాజకీయాలకు, జాతీయ ఫెడరల్ స్ఫూర్తికి, ఆదివాసీ సమాజానికి, తీరని లోటని ప్రశంసించారు. ఈ మేరకు కేసీఆర్ ఇవాళ(సోమవారం) ఓ ప్రకటన విడుదల చేశారు.

ఈ సందర్భంగా శిబూసోరెన్తో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి వారందించిన సహకారాన్ని కేసీఆర్ స్మరించుకున్నారు. దేశ ఫెడరల్ స్ఫూర్తిని ప్రతిఫలించే దిశగా, శిబూ సోరెన్ చేపట్టిన జార్ఖండ్ స్వరాష్ట్ర ఏర్పాటు ఉద్యమం.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి స్ఫూర్తి నింపిందని ఉద్ఘాటించారు. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) స్థాపన సమయంలో శిబూ సోరెన్ని హైదరాబాద్లో జరిగిన తొలి సభకు మొదటి అతిథిగా ఆహ్వానించుకున్నామని గుర్తుచేశారు. నాటి తెలంగాణ ఉద్యమానికి వారు తెలిపిన సంపూర్ణ సంఘీభావం మర్చిపోలేనిదని కేసీఆర్ స్మరించుకున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించిన శిబూసోరెన్, తాను ప్రారంభించిన తెలంగాణ మలిదశ ఉద్యమానికి అండగా నిలిచారని కేసీఆర్ తన కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేశారు.

2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో కూడా శిబూసోరెన్ మద్దతుగా నిలిచారని కేసీఆర్ చెప్పుకొచ్చారు. జార్ఖండ్, తెలంగాణ ప్రజల ఉద్యమ విజయాలు...దేశ ఫెడరల్ స్ఫూర్తికి, ప్రాంతీయ, సామాజిక న్యాయానికి దిక్సూచిగా నిలిచాయని అభివర్ణించారు. శిబూసోరెన్ JMM పార్టీ, తెలంగాణ ఉద్యమ సమయంలో కేంద్రంలో ఉన్న యూపీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండటంతో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఒత్తిడి తేవడంలో కీలక పాత్ర పోషించిందని కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం 2022లో జార్ఖండ్లో శిబూసోరెన్ని కలిసి వారి ఆశీస్సులు తీసుకున్న విషయాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. శిబూసోరెన్ ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ ప్రార్థించారు. తండ్రిని కోల్పోయి దు:ఖసంద్రంలో మునిగిన వారి కుమారుడు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కు, వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..
మహిళలు, పిల్లల రక్షణపై స్పెషల్ ఫోకస్
డ్రగ్స్ కేసుల్లో పబ్బులకు లింకులు
Read latest Telangana News And Telugu News