Smita Sabharwal in High Court: స్మిత సబర్వాల్కి హైకోర్టులో బిగ్ రిలీఫ్
ABN , Publish Date - Sep 25 , 2025 | 12:17 PM
ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ (IAS Smita Sabharwal)కు తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో ఊరట లభించింది. కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కమిషన్ తన వివరణ కోరలేదంటూ ఇప్పటికే దాఖలైన పిటిషన్లతో కలిపి హైకోర్టు విచారణ చేపట్టింది. తదుపరి విచారణ అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.
కాగా, స్మితా సబర్వాల్ పిటిషన్పై ఇవాళ(గురువారం) హై కోర్టులో విచారణ జరిగింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను కొట్టివేయాలని కోరుతూ స్మితా సబర్వాల్ పిటిషన్ దాఖలు చేశారు. కాళేశ్వరంపై విచారణలో తన వివరణ కోరలేదని, 8బీ, 8సీ నోటీసులు ఇవ్వలేదని స్మితా సబర్వాల్ ఆరోపణలు చేసింది. అయితే, స్మిత సబర్వాల్ చర్యలను రిపోర్టులో పేర్కొంది పీసీ ఘోష్ కమిషన్.
కాళేశ్వరం నిర్మాణాలపై స్మితా సబర్వాల్ రివ్యూ చేసిందని ఘోష్ కమిషన్ తెలిపింది. కొన్ని జిల్లాలు తిరిగి ఫీడ్బ్యాక్ను ఎప్పటికప్పుడూ అప్పటి సీఎం కేసీఆర్కి చేరవేశారని స్మిత సబర్వాల్పై పీసీ ఘోష్ కమిషన్ ఆరోపణలు చేసింది. చీఫ్ మినిస్టర్ ఆఫీస్ స్పెషల్ సెక్రటరీ హోదాలో పలు సందర్భాల్లో స్మిత సబర్వాల్ మూడు బ్యారేజీలను సందర్శించారని కమిషన్ గుర్తుచేసింది. కాళేశ్వరంపై అడ్మినిస్ట్రేటివ్ అనుమతులు జారీ చేయడంలో స్మిత సబర్వాల్ కీలకపాత్ర పోషించారని కమిషన్ చెప్పుకొచ్చింది. నిజానిజాలను కేబినెట్ ముందు పెట్టనందుకు స్మిత సబర్వాల్పై చర్యలు తీసుకోవాలని పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్లో పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి..
నేటి అలంకారం శ్రీ కాత్యాయనీ దేవి
పార్టీ పరిశీలకులతో అగ్రనేతలు భేటీ
Read Latest Telangana News And Telugu News