KTR VS Revanth Reddy: నేను చర్చకు వస్తే.. ఢిల్లీకి రేవంత్రెడ్డి పారిపోయారు.. కేటీఆర్ సెటైర్లు
ABN , Publish Date - Jul 08 , 2025 | 01:17 PM
తనతో చర్చకు రాకుండా సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీకి పారిపోయారని మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్లు గుప్పించారు. చర్చకు వచ్చే సత్తా లేనప్పుడు.. రేవంత్రెడ్డి మరోసారి సవాల్ చేయొద్దని కేటీఆర్ హితవు పలికారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి (CM Revanth Reddy) రచ్చ చేయటమే తెలుసు.. చర్చ చేయటం రాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) విమర్శించారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్కి రావాలని తాను సవాల్ చేస్తే రేవంత్రెడ్డి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. రైతులపై చర్చకు సీఎం రేవంత్రెడ్డి కోసం తాను సోమాజిగూడ ప్రెస్క్లబ్లో వేచి చూస్తున్నానని స్పష్టం చేశారు. తనతో చర్చకు రాకుండా.. రేవంత్రెడ్డి ఢిల్లీకి పారిపోయారనిసెటైర్లు గుప్పించారు. తాను చెప్పినట్లుగానే చర్చకు వచ్చానని.. రేవంత్రెడ్డి ఎక్కడంటూ మాజీ మంత్రి కేటీఆర్ నిలదీశారు. ఈ క్రమంలో సోమాజిగూడ ప్రెస్క్లబ్లో కేటీఆర్.. సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీ పరార్ అంటూ బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా మీడియాతో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. రేవంత్రెడ్డి ముక్కు నేలకు రాసి కేసీఆర్కు క్షమాపణ చెప్పాలని అన్నారు. చర్చకు వచ్చే సత్తా లేనప్పుడు.. రేవంత్రెడ్డి మరోసారి సవాల్ చేయొద్దని హితవు పలికారు. రేవంత్రెడ్డి ఢిల్లీ వెళ్లింది యూరియా బస్తాల కోసం కాదని చెప్పుకొచ్చారు. ఏ బస్తాలు మోసి రేవంత్ ముఖ్యమంత్రి పదవి కాపాడుకుంటున్నారో అందరికీ తెలుసునని విమర్శించారు. ఏ బేసిన్ ఎక్కడుందో కూడా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి తెలియదని ఎద్దేవా చేశారు. రేవంత్రెడ్డి హయాంలో నీళ్లు ఆంధ్రకు.. నిధులు ఢిల్లీకి.. నియామకాలు రేవంత్ తొత్తులకు అని షాకింగ్ కామెంట్స్ చేశారు. రేవంత్రెడ్డి గురువు చంద్రబాబు కోసం తెలంగాణ నీళ్లను ఆంధ్రకు పంపుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్.
నాలుగు రోజులు మోసాలు చేసి రేవంత్ తప్పించుకోవచ్చు... కానీ ప్రజలు క్షమించరని మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. సవాల్ విసిరి మాట తప్పటం సీఎం రేవంత్రెడ్డికి అలవాటేనని సెటైర్లు గుప్పించారు. 2018లో కొండగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాట తప్పారని ఎద్దేవా చేశారు. తనతో చర్చకు మంత్రులను అయినా పంపుతారనుకున్నానని కానీ వారు కూడా రాలేదని విమర్శించారు. ప్రజా సమస్యలపై మళ్లీ ఎప్పుడైనా చర్చకు పిలిచినా రేవంత్రెడ్డితో మాట్లాడటానికి తాను సిద్ధమేనని ఛాలెంజ్ చేశారు. ప్లేస్, టైం రేవంత్రెడ్డి డిసైడ్ చేయాలని సవాల్ విసిరారు. సీఎం రేవంత్రెడ్డి స్థాయికి తాము చాలని... కేసీఆర్ అవసరం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలు ఇస్తామని అన్నారని... బాండ్ పేపర్లు కూడా రాసి ఇచ్చారని.. వాటిని ఎందుకు పూర్తిగా ఇవ్వడం లేదని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఏబీఎన్-ఆంధ్రజ్యోతిపై దాడులకు అవకాశం!
Read Latest Telangana News And Telugu News