USA Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
ABN , Publish Date - Jul 08 , 2025 | 05:15 AM
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో.. నగరానికి చెందిన ఓ నిండు కుటుంబం సజీవ దహనం అయింది. నగరంలోని కొంపల్లి ప్రాంతానికి శ్రీవెంకట్ బెజుగం, తేజస్విని దంపతులు, వారి ఇద్దరు..
తెలుగు కుటుంబం సజీవ దహనం
మూడేళ్ల క్రితం హైదరాబాద్ నుంచి డాల్సకు వెళ్లి స్థిరపడిన శ్రీవెంకట్, తేజస్విని కుటుంబం
భార్య, పిల్లలతో కలిసి.. అట్లాంటాలో ఉంటున్న తన అక్క ఇంటికి వెళ్లిన శ్రీవెంకట్
తిరిగి వస్తుండగా రాంగ్ రూట్లో వారి కారును బలంగా ఢీకొట్టిన మినీ ట్రక్కు
మంటలు చెలరేగి నలుగురూ కాలి బూడిద!
హైదరాబాద్ సిటీ, జూలై 7 (ఆంధ్రజ్యోతి): అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో.. నగరానికి చెందిన ఓ నిండు కుటుంబం సజీవ దహనం అయింది. నగరంలోని కొంపల్లి ప్రాంతానికి శ్రీవెంకట్ బెజుగం, తేజస్విని దంపతులు, వారి ఇద్దరు పిల్లలు సిద్ధార్థ్ బెజుగం, మ్రిదా బెజుగం దుర్మరణంపాలయ్యారు. శ్రీవెంకట్, తేజస్విని ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. వీరు మూడేళ్ల క్రితం అమెరికాకు వెళ్లి, డాల్సలో ఇల్లు కొనుక్కొని అక్కడే స్థిరపడ్డారు. ఇటీవలే శ్రీవెంకట్.. అట్లాంటాలోని తన అక్క ఇంటికి భార్య, పిల్లలతో సహా వెళ్లారు. వారంరోజులపాటు అక్కడే ఆనందంగా గడిపి తిరిగి వస్తుండగా.. ఆదివారం అర్ధరాత్రి గ్రీన్ కౌంటీ ఏరియాలో.. రాంగ్ రూట్లో వచ్చిన మినీ ట్రక్ వారి కారును ఢీ కొట్టింది. ట్రక్ వేగంగా ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. వెంకట్ కుటుంబం ప్రయాణిస్తున్న కారు మంటల్లో చిక్కుకుని పూర్తిగా కాలిపోయింది.
ఈ ప్రమాదంలో ఆ నలుగురి శరీరాలూ పూర్తిగా కాలిపోవడంతో అధికారులు వారి ఎముకలను సేకరించి.. డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ద్వారా గుర్తించే ప్రయత్నంలో ఉన్నారు. ట్రక్ డ్రైవర్ తప్పిదమే ఈ ప్రమాదానికి కారణమని స్థానిక పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కాగా.. వెంకట్ కుటుంబం మృతితో హైదరాబాద్లోని వారి కుటుంబ సభ్యులు, బంధువులు శోక సముద్రంలో మునిగిపోయారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన శ్రీవెంకట్ తల్లిదండ్రులు పశుపతినాథ్, గిరిజ నగరంలోని తిరుమలగిరి టీచర్స్కాలనీలో నివాసం ఉంటున్నారు. ఏడాది క్రితం వారు డాల్సలోని తమ కుమారుడి వద్దకు వెళ్లారు. అప్పట్నుంచీ అక్కడే ఉన్నారు. ఇక.. తేజస్విని తల్లిదండ్రులు రవి, అనిత కొంపల్లిలోని ఎన్సీఎల్ నార్త్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ప్రమాదం గురించి తెలియగానే సోమవారం రాత్రి వారు అమెరికాకు బయల్దేరి వెళ్లినట్లు కాలనీవాసులు తెలిపారు. తేజస్విని అన్నయ్య కూడా అమెరికాలోనే స్థిరపడినట్టు సమాచారం.