High Court on BC Reservation GO: బీసీ రిజర్వేషన్ జీవో ఇవ్వడం సరికాదు: తెలంగాణ హై కోర్టు
ABN , Publish Date - Sep 27 , 2025 | 08:44 PM
స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉన్నప్పుడు జీఓ ఇవ్వడం సరికాదని చెప్పింది. కోర్టుల జోక్యం ఉండకూడదంటే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసుకోవాలని హైకోర్టు సూచించింది.
హైదరాబాద్, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): బీసీలకు 42శాతం రిజర్వేషన్ల జీవో(BC Reservation GO)ను కొట్టివేయాలని కోరుతూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవాపూర్ గ్రామానికి చెందిన బుట్టెంగారి మాధవరెడ్డి తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై న్యాయస్థానంలో ఇవాళ (శనివారం) విచారణ జరిగింది. ఈ పిటిషన్పై జస్టిస్ అభినందన్ కుమార్, జస్టిస్ విజయ్ సేన్రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే, పిటిషనర్ తరఫున వాదనలు వినిపించారు న్యాయవాది మయూర్ రెడ్డి. మరోవైపు దీనిపై ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (MLC Teenmar Mallanna). ఈ విచారణకు తెలంగాణ ప్రభుత్వం తరఫున వర్చువల్గా హాజరయ్యారు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి (Advocate General Sudarshan Reddy). పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం సెక్షన్ 286(a) కింద 50శాతం మించరాదని పిటిషనర్స్ వాదించారు.
సుప్రీంకోర్టు (Supreme Court) ఉత్తర్వులు కూడా ఉన్నాయని న్యాయవాది మయూర్ రెడ్డి గుర్తుచేశారు. కాగా, అసెంబ్లీలో బీసీ బిల్ కోసం తీర్మానం చేశామని ధర్మాసనానికి అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. గవర్నర్ దగ్గర బిల్ పెండింగ్లో ఉందని చెప్పుకొచ్చారు. అసెంబ్లీ తీర్మానం ఫైనల్ చేసిందని.. అసెంబ్లీకి ఆ అధికారం ఉందని కోర్టుకు ఏజీ తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుపాలని ప్రభుత్వం చూస్తోందని.. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఏజీకి 15 నిమిషాల సమయం ఇచ్చింది హైకోర్టు. ప్రభుత్వం నిర్ణయం చెప్పాలని ఏజీని న్యాయస్థానం ఆదేశించింది. అక్టోబర్ 8వ తేదీ వరకు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన మెరిట్ ప్రకారం కేసు విచారిస్తామని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.
అవసరమైతే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలని న్యాయస్థానం ఆదేశించింది. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉన్నప్పుడు జీఓ ఇవ్వడం సరికాదని చెప్పింది. కోర్టుల జోక్యం ఉండకూడదంటే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసుకోవాలని హైకోర్టు సూచించింది. సోమవారం ప్రభుత్వ నిర్ణయం చెబుతామని హైకోర్టుకు ఏజీ తెలిపారు. ఈ మేరకు తదుపరి విచారణను అక్టోబర్ 8వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు. నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారని ఎన్నికల కమిషన్ను ప్రశ్నించింది. ఏ క్షణమైనా నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు న్యాయస్థానానికి ఈసీ తెలిపింది. నోటిఫికేషన్ ఇచ్చినా.. ఈ పిటిషన్లను విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం రేవంత్రెడ్డి
ఓటు చోరీపై మహేష్ గౌడ్ సంచలన ఆరోపణలు
Read Latest Telangana News and National News