Bihar Elections: మేము గెలిస్తే వక్ఫ్ బిల్లును చెత్తబుట్టలో పడేస్తాం.. తేజస్వి సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Oct 26 , 2025 | 09:40 PM
నితీష్ కుమార్ 20 ఏళ్ల పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, రాష్ట్ర యంత్రాంగం అవినీతిమయమైందని, శాంతిభద్రతలు లోపించాయని తేజస్వి ఆరోపించారు. సీమాంచల్ ప్రాంతాన్ని ఎన్డీయే ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు.
పాట్నా: వక్ఫ్ (సవరణ) చట్టం (Waqf Amendment Act)పై మహాఘట్బంధన్ (Mahagathbandhan) ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ (RJD) నేత తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహార్లో 'ఇండియా' కూటమి అధికారంలోకి వస్తే వక్ఫ్ చట్టాన్ని చెత్తబుట్టలో పడేస్తామని ప్రకటించారు. ముస్లింలు అధికంగా నివసించే కతిహార్ జిల్లాలో ఆదివారం నాడు నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన ఈ ప్రకటన చేశారు.
నితీష్, బీజేపీపై విమర్శలు
నితీష్ కుమార్ ఎప్పుడూ మతతత్వ శక్తులకు మద్దతిచ్చే వారని, ఇందుకు భిన్నంగా తన తండ్రి లాలూ ప్రసాద్ ఏరోజూ మతతత్వ శక్తులతో రాజీపడలేదని తేజస్వి చెప్పారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS), దాని అనుబంధ సంస్థలు రాష్ట్రంలోనూ, దేశంలోనూ విద్వేషాలు వ్యాప్తి చేస్తున్నాయని ఆరోపించారు. బీజేపీని 'భారత్ జలావో పార్టీ'గా అభివర్ణించారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మతతత్వ ఎజెండాను తీవ్రతరం చేస్తారని విమర్శించారు.
నితీష్ కుమార్ 20 ఏళ్ల పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, రాష్ట్ర యంత్రాంగం అవినీతిమయమైందని, శాంతిభద్రతలు లోపించాయని ఆరోపించారు. సీమాంచల్ ప్రాంతాన్ని ఎన్డీయే ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. మహాఘట్బంధన్ గెలిస్తే సీమాంచల్ డవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎన్డీయే ప్రభుత్వం మహాకూటమి ఎన్నికల వాగ్దానాలను కూడా కాపీ చేసిందని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నెలసరి వృద్ధాప్య పెన్షన్లను రూ.2,000కు పెంచుతామని వాగ్దానం చేశారు.
ఇవి కూడా చదవండి..
దేశవ్యాప్త ఎస్ఐఆర్ తొలివిడతపై ఈసీ కీలక మీడియా సమావేశం.. ఎప్పుడంటే
ఛత్తీస్గఢ్లో 21 మంది మావోయిస్టుల లొంగుబాటు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి