Senior IPS Sanjay: సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్కు రిమాండ్..
ABN , Publish Date - Aug 26 , 2025 | 04:56 PM
గత వైసీపీ హయాంలో సంజయ్ సీఐడీ చీఫ్గా పనిచేసినప్పుడు అవినీతి ఆరోపణలు బయటపడ్డాయి. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఆయా చట్టాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు, అలాగే ఫైర్ సేఫ్టీ పరికరాలు కొనుగోలు విషయంలో ఆయన అవకతవకలకు పాల్పిడినట్లు తేలింది.
విజయవాడ: సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ కు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. వైసీపీ హయాంలో అగ్నిమాపక శాఖ చీఫ్గా, సీఐడీ అధిపతిగాను సంజయ్ అవినీతికి పాల్పడ్డారంటూ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం కూటమి ప్రభుత్వానికి రెండు వేర్వేరు నివేదికలు సమర్పించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన కోర్టు సంజయ్ ను రిమాండ్ కు పంపింది. ఫైర్ డిపార్ట్మెంట్లో NOC జారీ అంశంలో భారీ అవకతవకలకు పాల్పడ్డారని పోలీసులు ఆయనపై కేసు నమోదు చేయగా.. ముందస్తు బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టును సంజయ్ ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ను ధర్మాసనం ఇటీవల డిస్మిస్ చేసింది. దానితో పాటు ఏసీబీ కోర్టులో మూడు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ కోర్టులో హాజరయ్యారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. సెప్టెంబర్ 8 వరకు రిమాండ్ విధిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల అనంతరం ఏసీబీ అధికారులు సంజయ్ను విజయవాడ జైలుకు తరలించారు.
గత వైసీపీ హయాంలో సంజయ్ పనిచేసినప్పుడు ఈ అవినీతి ఆరోపణలు బయటపడ్డాయి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాలపై ఆయా వర్గాలకు అవగాహన కల్గించడం విషయంలో ప్రభుత్వ నిధులను సంజయ్ దుర్వినియోగం చేసినట్లు అభియోగాలు నమోదు అయ్యాయి. అలాగే అగ్నిమాపక శాఖలో ఎన్వోసీలు ఇచ్చేందుకు ముఖ్యంగా మొబైల్ యాప్ అభివృద్ధి, నిర్వహణ, ట్యాబ్ల కొనుగోళ్ల విషయంలో ఆ శాఖ అధిపతిగా ఉంటూ భారీ అవినీతికి పాల్పడినట్లు తేలింది.
ప్రైవేటు సంస్థలతో కుమ్మక్కై కొన్ని కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారని సంజయ్ పై కేసు నమోదైంది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సంజయ్ తొలుత ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది జనవరి 30న హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే, హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాలు చేయగా.. సర్వోన్నత న్యాయస్థానం వాటిని కొట్టివేసింది. మూడు వారాల్లోగా కోర్టులో లొంగిపోవాలని, ఆ తర్వాతే సాధారణ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఐపీఎస్ సంజయ్ ఇవాళ ఏసీబీ కోర్టులో లొంగిపోయారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ పింఛన్ల కొనసాగింపుపై కీలక ఆదేశాలు..
ప్రపంచానికి అనుగుణంగా మారండి.. బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు
For Telangana News And Telugu News