Nara Lokesh on London Road Show: ఏపీలో పెట్టుబడుల కోసం లండన్లో నారా లోకేష్ రోడ్ షో
ABN , Publish Date - Sep 16 , 2025 | 09:51 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ లండన్లో పర్యటిస్తున్నారు. మంగళవారం లండన్లో హైప్రొఫైల్డ్ ఇన్వెస్టర్స్ రోడ్ షో నిర్వహించారు లోకేష్.
అమరావతి, సెప్టెంబరు16(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) లండన్ (London)లో పర్యటిస్తున్నారు. ఇవాళ (మంగళవారం) లండన్లో హైప్రొఫైల్డ్ ఇన్వెస్టర్స్ రోడ్ షో నిర్వహించారు లోకేష్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్, పాల్మాల్ కన్వెన్షన్ వేదికగా ఈ రోడ్ షో జరిగింది. విశాఖపట్నంలో నవంబర్ 14, 15వ తేదీల్లో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పార్టనర్ షిప్ సమ్మిట్ -2025ను నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా గ్లోబల్ లీడర్లను ఆహ్వానిస్తూ రోడ్ షో నిర్వహించారు మంత్రి నారా లోకేష్.
ఈ రోడ్ షో (London Road Show)లో యుకే డిప్యూటీ హై కమిషనర్ సుజిత్ ఘోష్, టెక్ మహీంద్రా యూరప్ విభాగం ప్రెసిడెంట్ హర్షూల్ అస్నానీ, ఐసీఐసీఐ బ్యాంకు యుకే విభాగం సీఈఓ రాఘవ్ సింఘాల్, ఏపీఐఐసీ వైస్ చైర్మన్, ఎండీ అభిషిక్త్ కిషోర్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ ఫండ్, మ్యాన్ఫ్యాక్చరింగ్ కంపెనీలు, సర్వీస్ ప్రొవైడర్ కంపెనీలకు చెందిన 150మంది సీఈఓలు, సీనియర్ ఎగ్జిక్యూటివ్లు హాజరయ్యారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలను వివరించారు లోకేష్. గత 15నెలల కాలంలో ఏపీకి వచ్చిన పెట్టుబడులు, కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు గల అవకాశాలను వివరించారు మంత్రి లోకేష్.
గత 15నెలల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 10,06,799 కోట్ల విలువైన 122 భారీ ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చిందని తెలిపారు. ఏపీలో కొత్తగా ఏర్పాటయ్యే పరిశ్రమల కోసం ఒక లక్ష ఎకరాల భూమి కలిగిన పారిశ్రామిక క్లస్టర్లను ప్రభుత్వం సిద్ధం చేసిందని చెప్పుకొచ్చారు. మరో ఏడాదిలో ఈ పెట్టుబడులను రెట్టింపు చేయాలన్నది ఏపీ ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. అలాగే, లండన్ రోడ్షోలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల అవకాశాలపై మంత్రి నారా లోకేష్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత సంస్థలైన హిందుజా, రోల్స్ రాయిస్ వంటి గ్రూప్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు మంత్రి లోకేష్.
గ్లోబల్ బిజినెస్ లీడర్లు, పెట్టుబడిదారులతో ఫైర్సైడ్ చాట్ చేశారు లోకేష్. ఈ రోడ్షో సందర్భంగా మంత్రి లోకేష్ ఏపీలో పోర్టు ఆధారిత పారిశ్రామికీకరణ, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ ఇన్నోవేషన్, ఆధునిక తయారీ రంగం వంటి అంశాలను కూడా హైలైట్ చేశారు. పెట్టుబడులతో పాటు శాశ్వత ఆర్థికావకాశాలను ఇన్వెస్టర్లకు వివరించారు లోకేష్. ఈ రోడ్ షోలో ఎరిక్సన్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, సియాంట్, ఇవాంటె గ్లోబల్, ఏఐ ఓపెన్సెక్, లండన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వంటి దిగ్గజ సంస్థల ప్రతినిధులతో పాటు ఇతర పరిశ్రమల ప్రముఖులు కూడా హాజరయ్యారు. నవంబర్లో జరిగే పార్టనర్ షిప్ సమ్మిట్కు రావాల్సిందిగా గ్లోబల్ కంపెనీల సీఈఓలు, పాలసీ మేకర్లు, ఇండస్ట్రీ లీడర్లను మంత్రి లోకేష్ ఆహ్వానించారు. ట్రేడ్, టెక్నాలజీ, స్థిరమైన వృద్ధి అంశాలపై లండన్ రోడ్ షోలో మంత్రి లోకేష్ కీలక చర్చలు జరిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
రెవెన్యూలో టెక్నాలజీ సమగ్రంగా అమలు చేయండి: సీఎం చంద్రబాబు
జగన్ అసెంబ్లీకి రా.. తేల్చుకుందాం..మంత్రి ఆనం స్ట్రాంగ్ సవాల్
Read Latest Andhra Pradesh News and National News