CM Chandrababu on NTR Book Launch: సజీవ చరిత్ర పుస్తకం ద్వారా వాస్తవాలు తెలుస్తాయి: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Sep 16 , 2025 | 08:32 PM
దేశ రాజకీయాల్లో 1983 ఒక సంచలనమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సజీవ చరిత్ర పుస్తకం ద్వారా 1984లో చోటు చేసుకున్న వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయని తెలిపారు.
అమరావతి, సెప్టెంబరు16(ఆంధ్రజ్యోతి): దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao)కి సంబంధించిన ’సజీవ చరిత్ర’ (Sajeeva Charitra) పేరిట రూపొందించిన పుస్తకావిష్కరణ కార్యక్రమం ఇవాళ(మంగళవారం) పోరంకిలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి, ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రి కొల్లు రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.
1984లో ఎన్టీఆర్ ప్రభుత్వ బర్తరఫ్ తర్వాత సాగిన ఉద్యమంలోని ప్రధాన ఘట్టాలు, దారితీసిన పరిస్థితులపై ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఈ పుస్తకాన్ని ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్, రచయిత విక్రమ్ పూల రూపొందించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన చంద్రబాబు, వెంకయ్యనాయుడు, అయ్యన్నపాత్రుడు, ఇంద్రసేనారెడ్డిల అభిప్రాయాలతో ఈ పుస్తకాన్ని రూపొందించారు. అయితే, ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ సినిమాల్లో పోషించిన ముఖ్యమైన ఘటనలతోపాటు 1984లో చోటు చేసుకున్న పరిణామాలను వివరిస్తూ ఏవీ ప్రదర్శించారు.
దేశ రాజకీయాల్లో 1983 సంచలనం..
దేశ రాజకీయాల్లో 1983 ఒక సంచలనమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. సజీవ చరిత్ర పుస్తకం ద్వారా 1984లో చోటు చేసుకున్న వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయని తెలిపారు. మూడున్నర దశాబ్దాలపాటు కాంగ్రెస్ పాలనకు 1983 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఒక గుణపాఠమని చెప్పుకొచ్చారు. 161 మంది ఎమ్మెల్యేలను అప్పటికప్పుడు రామకృష్ణ స్టూడియోకి వెళ్లి క్యాంప్ పెట్టారని గుర్తుచేశారు. 37 సంవత్సరాల్లో 26 ప్రభుత్వాలను పడగొట్టారని తెలిపారు. 18 నెలలకు ఒక ప్రభుత్వం పడిపోయిందని.. ఈ మహా పోరాటంలో గెలిచింది ఒక్క ఎన్టీ రామారావు మాత్రమేనని ఉద్ఘాటించారు సీఎం చంద్రబాబు.
ఇంద్రసేనారెడ్డిది కీలకపాత్ర..
ప్రజాస్వామ్యం కింద జరిగిన ద్రోహం కింద ప్రజలు తిరగబడ్డారని గుర్తుచేశారు. ఇంద్రసేనారెడ్డి అప్పట్లో ఎమ్మెల్యేలను తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారని తెలిపారు. దేశంలో నాయకులందరినీ ఒక తాటి మీదకు తీసుకొచ్చేందుకు వెంకయ్య నాయుడు ఎంతో కృషి చేశారని ఉద్ఘాటించారు. ఆ రోజు గవర్నర్ రామ్ లాల్ ఏకపక్షంగా వ్యవహారించారని గుర్తుచేశారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చారని చెప్పుకొచ్చారు. ఎప్పుడూ లేని సంఘీభావాన్ని ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి చూపించారని గుర్తుచేశారు. దేశంలో తమకు ఎవరూ అకామిడేషన్ ఇవ్వకపోతే ఒక్క రామకృష్ణ హెగ్డే ఒక్కరే కర్ణాటకలో ఆశ్రయం ఇచ్చారని తెలిపారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే చాలామంది తిరిగి ఇంటికి వెళ్లిన పరిస్థితి ఉందని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు.
సీఎం చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్య అంశాలు...
మా అత్తయ్య క్యాన్సర్తో బాధపడ్డారు.
ఎన్టీఆర్కు భారతరత్న ఇచ్చేవరకు పోరాటం చేస్తాం... కచ్చితంగా సాధిస్తాం.
సజీవ చరిత్ర 1984 పుస్తకం ద్వారా ఇప్పటి ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి.
ప్రజలే దేవుళ్లు... సమాజమే దేవాలయం అని చెప్పిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్.
నదుల అనుసంధానానికి ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారు.
ఇప్పుడు దేశవ్యాప్తంగా నదుల అనుసంధానం అమలవుతోంది.
ఎన్టీఆర్ చేసిన ప్రతి ఒక్క సంక్షేమ పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఆనాడు ఎన్టీఆర్ ప్రారంభించిన యాంటీ కాంగ్రెస్ ఉద్యమం దేశంలో ఇప్పుడు కూడా కొనసాగుతోంది.
ఎన్టీఆర్ వేసిన ఫౌండేషన్ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం సుస్థిరంగా ఉండేందుకు దోహదపడుతోంది.
రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే భారతదేశం అగ్రదేశంగా ఉంటుంది.
తెలుగు చిత్రసీమలో ఎన్టీఆర్ ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు.
శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఎలా ఉంటారో మనకు తెలియదు.
ఎన్టీఆర్ను చూస్తే మనకి ఆ దైవ స్వరూపం గుర్తొస్తోంది.
అమరావతిలో తెలుగు వైభవం పేరుతో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం.
ఎన్టీఆర్ మన ముందు లేరు.... కానీ ఆయన ఆశయాలు మాత్రం మా ముందు ఉంటాయని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.
ఈ వార్తలు కూడా చదవండి
రెవెన్యూలో టెక్నాలజీ సమగ్రంగా అమలు చేయండి: సీఎం చంద్రబాబు
జగన్ అసెంబ్లీకి రా.. తేల్చుకుందాం..మంత్రి ఆనం స్ట్రాంగ్ సవాల్
Read Latest Andhra Pradesh News and National News