CM Chandrababu: ఫిజికల్ హెల్త్ ఇండెక్స్లో ఏపీ స్థానం ఇదే... సీఎం చంద్రబాబు ఏం చెప్పారంటే
ABN , Publish Date - Jan 27 , 2025 | 05:06 PM
Chandrababu: ఏపీని శ్రీలంక పరిస్థితికి గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని సీఎం చద్రబాబు నాయుడు ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోతే.. ప్రజలకు ఇబ్బందులు తప్పవని సీఎం చంద్రబాబు చెప్పారు.
అమరావతి: ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం సృష్టించిందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఆరోపించారు. ఏపీ ఆర్థిక పరిస్థితిని నీతి ఆయోగ్ నివేదిక వివరించిందని అన్నారు. నీతి ఆయోగ్ నివేదికలో ఏపీ ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ఆర్థిక విధ్వంసానికి నీతి అయోగ్ నివేదికే నిదర్శనమని చెప్పారు. రాష్ట్ర, దేశ భవిష్యత్ కోసం అందరూ ఆలోచించాలని తెలిపారు. ఆరోగ్యం, ఆర్థిక అంశాల్లో ఏపీలో ఉన్న పరిస్థితిని నీతి ఆయోగ్ వెల్లడించింది. ఈ నివేదికపై సీఎం చంద్రబాబు స్పందించారు. నాయకుల సమర్థత ఆధారంగా ఆ రాష్ట్ర ప్రజల భవిష్యత్ ఆధారపడి ఉంటుందని అన్నారు. నాయకుల అసమర్థత, తెలియని తనంతో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా మారుతుందని సీఎం చంద్రబాబు చెప్పారు.
వైసీపీ హయాంలో ప్రభుత్వ కార్యాలయాల తాకట్టు..
నీతి అయోగ్ ఇచ్చిన నివేదిక ఏపీ ఆర్థిక పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందనేది వివరించిందని అన్నారు. 2014-2015 నుంచి 2022-2023 వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నీతి ఆయోగ్ సమీక్షించిందని అన్నారు. ఫిజికల్ హెల్త్ ఇండెక్స్లో ఏపీ చివరిలో ఉందని నీతి ఆయాగ్ చెప్పిందని గుర్తుచేశారు. ఏపీకి కనీసం అప్పు తీసుకునే అర్హత కూడా లేకుండా గత జగన్ ప్రభుత్వం చేసిందని మండిపడ్డారు. కనీసం చేసిన అప్పులకు వడ్డీలు కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అభివృద్ధి పనులపై ఎక్కువ నిధులు ఖర్చు చేయాలని చెప్పారు. అప్పులు చేసి పనులు చేస్తే ఇబ్బందులు పెరుగుతాయన్నారు. అప్పు చేస్తే తిరిగి చెల్లించే శక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లేదని చెప్పారు. పన్నులు పెరుగుతాయి, అప్పులు చేయాల్సి వస్తోందని అన్నారు. అందుకే వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలను తాకట్టు పెట్టిందని ఆరోపించారు. గత ఐదేళ్లలో వచ్చిన ఆదాయం ఏం చేశారో తెలియదని సీఎం చంద్రబాబు అన్నారు.
సంపద సృష్టించాలి..
‘‘ఆర్థిక పరిస్థితి చూసి.. ఆ రాష్ట్ర పరిస్థితి చెప్పగలం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంటేనే సంక్షేమం, అభివృద్ధి. ఏ రాష్ట్రమైనా బాగుపడాలంటే సంపద సృష్టించాలి. ఆదాయం పెంచి.. సంక్షేమానికి డబ్బు కేటాయించాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోతే.. ప్రజలకు ఇబ్బందులు తప్పవు. వైసీపీ పాలనలో వృద్ధి రేటు సగానికి పైగా పడిపోయింది. నేను గతంలో చెప్పిన విషయాలను ఇప్పుడు నీతి ఆయోగ్ ధ్రువీకరించింది. వెంటిలేటర్పై ఉండే ప్రభుత్వాన్ని వెంటిలేటర్ తేసేశాం. కానీ పరిగెత్తే పరిస్థితి లేదు. ఆదాయం పెరగాలి..అందుకనుగుణంగా పనిచేస్తున్నాం. డేట్ రీ షెడ్యూల్కు వెళ్తున్నాం. ఇప్పుడు అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు. ఆదాయం , తలసరి ఆదాయం పెరగాలి. కానీ తలసరి అప్పు పెరిగింది. వైసీపీ ప్రభుత్వం చేసిన దుర్మార్గం ఇది. నేను మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాను. కానీ ఈసారి పరిస్థితి ఎప్పుడు లేదు. ప్రజలు అందరికీ చెబుతున్నా...కొంత ఆలస్యం అయింది...అందరు అర్థం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం. ఆదుకోబట్టి కొంతవరకు నిలబడ్డాం. 2019లో టీడీపీ గెలిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు. నేను ఢిల్లీ వెళ్తే చాలామంది అధికారులు మీరు ఆర్థికంగా నిలవడగలుగుతారా? అని అడిగారు. దీనిని రివైవ్ చేస్తాం.. త్వరలోనే గాడిలో పెడతాం.’’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.
అప్పు తెచ్చి వడ్డీలు కట్టారు..
‘‘అప్పులు తెచ్చి జల్సాలు చేశారు.. ఆదాయం ఎలా పెరుగుతుంది. గత ఐదేళ్లలో వచ్చిన ఆదాయం ఏం చేశారో తెలియదు. మంచి రాష్ట్రాన్ని ఆర్ధిక ఇబ్బందుల్లోకి పడేశారు. ఏపీని అప్పుల ఊబిలోకి నెట్టేశారు. తెచ్చిన అప్పులో కనీసం 50శాతం క్యాపిటల్ ఎక్స్పెండీచర్కు పెట్టాలి. వైసీపీ హయాంలో అప్పు తెచ్చి వడ్డీలు కట్టారు. గత ఐదేళ్లలో కమిటెడ్ ఎక్స్పెండీచర్ 11.6శాతానికి చేరింది. స్టేట్ ఓన్ రివెన్యూ గ్రోత్ రేట్ పడిపోతూ వస్తోంది. అప్పు తీర్చలేని పరిస్థితికి తెచ్చారు. ఏపీని శ్రీలంక చేస్తున్నారని అప్పుడే చెప్పాను’’ అని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
టెక్నాలజీతో మెరుగ్గా ప్రభుత్వ సేవలు: చంద్రబాబు
ఆర్టీజీఎస్పై(RTGS) ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి ఇంటిలో ఏఐ ప్రొఫెషనల్ ఉండాలని చెప్పారు. ఏఐను కూటమి ప్రభుత్వం పెద్దఎత్తున ప్రోత్సహిస్తోందని అన్నారు. టెక్నాలజీతో మెరుగ్గా ప్రభుత్వ సేవలు అందిస్తుందన్నారు. ఆర్టీజీఎస్తో అన్ని శాఖల డేటా అనుసంధానం చేస్తామని వివరించారు. త్వరలో వాట్సాప్ గవర్నెన్స్ ప్రవేశపెడతామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Ayyanna Patrudu Tourism: పర్యాటక రంగంపై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు
Pawan Kalyan: నువ్వు మరిన్ని రికార్డులు నెలకొల్పాలి.. దేవాన్ష్కు పవన్ అభినందనలు
Ayyanna Patrudu Tourism: పర్యాటక రంగంపై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు
Read Latest AP News And Telugu News