Share News

Uttam: ధాన్యం కొనుగోళ్లే 200 కోట్లు.. వెయ్యి కోట్ల స్కాం ఎలా?

ABN , Publish Date - May 27 , 2024 | 03:17 AM

‘‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డిని తొందరగా ఓవర్‌ టేక్‌ చేయాలని ఆ పార్టీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్‌ రెడ్డికి ఉండొచ్చు! అందుకోసం మాపై అడ్డగోలుగా మాట్లాడితే ఎట్లా? రూ.1.30 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోళ్లలో రూ.వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిందని మాట్లాడుతున్నడు.

Uttam: ధాన్యం కొనుగోళ్లే 200 కోట్లు.. వెయ్యి కోట్ల స్కాం ఎలా?

  • కిషన్‌రెడ్డిని ఓవర్‌టేక్‌ చేయాలని అడ్డగోలు మాటలా?

  • ఢిల్లీకి పైసలు పంపి, పదవిని మీరు కొనుక్కున్నారేమో!

  • బీజేపీఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డిపై మంత్రి ఉత్తమ్‌ ధ్వజం

  • డిఫాల్టర్లపై చర్యలు తీసుకుంటే మీకు ఎందుకు బాధ?

  • ఇంతవరకు గింజైనా సన్నబియ్యం కొనలేదు: ఉత్తమ్‌

  • కిషన్‌రెడ్డిని ఓవర్‌టేక్‌ చేయాలని అడ్డగోలుగా మాట్లాడితే ఎట్లా?

  • మహేశ్వర్‌ రెడ్డిపై మంత్రి ఉత్తమ్‌ ధ్వజం

హైదరాబాద్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): ‘‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డిని తొందరగా ఓవర్‌ టేక్‌ చేయాలని ఆ పార్టీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్‌ రెడ్డికి ఉండొచ్చు! అందుకోసం మాపై అడ్డగోలుగా మాట్లాడితే ఎట్లా? రూ.1.30 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోళ్లలో రూ.వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిందని మాట్లాడుతున్నడు. జరిగిన కొనుగోళ్లే 30 లక్షల టన్నులు. మొత్తం రూ.200 కోట్ల విలువైన ధాన్యం కొనుగోళ్లు జరగకుండా రూ.వెయ్యి కోట్ల కుంభకోణం ఎలా సాధ్యమవుతుంది?’’ అని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోళ్లలో తాను కమీషన్‌ తీసుకుని వెయ్యి కోట్లు ఢిల్లీకి పంపానంటూ మహేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతున్నారని, కొత్తగా బీజేపీలో చేరిన ఆయన ఢిల్లీకి పైసలు పంపి ఫ్లోర్‌ లీడర్‌ పదవిని కొనుక్కున్నారేమో కానీ.. ఆ సంస్కృతి తనకు లేదన్నారు.


ధాన్యం కొనుగోళ్ల పేరుతో ప్రభుత్వ పెద్దలను కలిసి లోపల భూముల గురించి మాట్లాడే సంస్కృతీ తమది కాదన్నారు. గాంధీ భవన్‌లో ఆదివారం మీడియాతో ఉత్తమ్‌ మాట్లాడారు. తమ ప్రభుత్వం, పౌర సరఫరాల శాఖపై బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసి విషప్రచారం చేస్తున్నాయని, వాటి ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. గత ప్రభుత్వం పౌర సరఫరాల శాఖను అస్తవ్యస్తం చేసి వదిలేసిందన్నారు. కార్పొరేషన్‌ రుణాలు రూ.58వేల కోట్లు ఉండగా నష్టాలు రూ.11వేల కోట్లు ఉన్నాయన్నారు. ఆరు నెలలుగా పరిస్థితులను చక్కదిద్ది రైతులు, వినియోగదారులకు తాము మేలు చేస్తుంటే... బీజేపీ, బీఆర్‌ఎస్‌ బదనాం చేయాలని ప్రయత్నిస్తున్నాయన్నారు. ఇంతవరకు ఒక్కగింజ సన్నబియ్యం కొనుగోలు గానీ, ఒక్క గింజ సన్న వడ్ల అమ్మకం కానీ జరగలేదన్నారు. ప్రభుత్వం వద్ద స్టాకు ఉన్న సన్న వడ్లనే మిల్లింగ్‌ చేసి సరఫరా చేయబోతున్నట్టు తెలిపారు.


బీజేపీ, బీఆర్‌ఎస్‌ వాళ్లు చెబుతున్న ప్రకారం కిలో రూ.42 చొప్పున ఎంత సన్నబియ్యాన్ని వారు సరఫరా చేస్తే అంతా కొంటామని చెప్పారు. అయితే వారికి టెండర్‌ షరతులు వర్తిస్తాయన్నారు. మిల్లర్ల విషయంలో నిబంధనలు కచ్చితంగా అమలుచేస్తున్న ప్రభుత్వం తమదేనన్నారు. గత ప్రభుత్వం కూడా ఇలానే వ్యవహరించి ఉంటే ఈ పరిస్థితి రాకపోయేదన్నారు. ప్రభుత్వ ధాన్యాన్ని అమ్మేసుకున్న 43 మంది మిల్లర్లపై రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగిస్తే బీజేపీ, బీఆర్‌ఎస్‌ వాళ్లకు ఎందుకంత బాధ అని ప్రశ్నించారు. డిఫాల్టర్లు ఈ బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతలతో చేరి అబద్ధాలు మాట్లాడిస్తున్నారని ఆరోపించారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసిపోయినా సీట్లు రావట్లేదన్న అక్కసుతో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. గత ఏడాది ఎంజీఎం ఆసుపత్రిలో 121సార్లు కరెంట్‌ బ్రేక్‌డౌన్‌ అయిందని, పేషెంట్‌పై ఎలుకలు దాడి చేశాయని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జీవన్‌రెడ్డి మాట్లాడుతూ వాస్తవాలు మాట్లాడితేనే పెద్దలీడర్‌ అవుతారని మహేశ్వర్‌ రెడ్డికి హితవు పలికారు.

Updated Date - May 27 , 2024 | 03:17 AM