Share News

Hyderabad: భూ సర్వేపై కదలిక..

ABN , Publish Date - May 25 , 2024 | 05:11 AM

రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర భూ సర్వేపై కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందుకు సర్వే సెటిల్మెంట్‌ ల్యాండ్‌ రికార్డు కమిషనర్‌ కార్యాలయం అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. భూ సర్వే పూర్తి చేసేందుకు ఎన్ని నిధులు కావాలి?

Hyderabad: భూ సర్వేపై కదలిక..

  • ల్యాండ్‌ రికార్డు కమిషనర్‌ కార్యాలయం ప్రణాళిక

  • ఎన్ని నిధులు కావాలి? ఎందరు సిబ్బంది అవసరం?

  • సర్వేకు పట్టే కాలమెంత? తలెత్తే ఇబ్బందులేమిటి?

  • సమగ్ర అంచనాలతో నివేదిక రూపకల్పన

  • సర్వేకు 300 కోట్లు.. కేంద్రం నుంచే పొందే ఆలోచన

  • 2025-26 నాటికి పూర్తి చేయాలన్న కేంద్ర ప్రభుత్వం

  • పదేళ్ల కిందటే రూ.83.85 కోట్లు మంజూరు

  • గత ప్రభుత్వం ఖర్చు చేసింది కేవలం రూ.2.65 కోట్లే

హైదరాబాద్‌, మే 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర భూ సర్వేపై కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందుకు సర్వే సెటిల్మెంట్‌ ల్యాండ్‌ రికార్డు కమిషనర్‌ కార్యాలయం అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. భూ సర్వే పూర్తి చేసేందుకు ఎన్ని నిధులు కావాలి? ఎంత మంది సిబ్బంది అవసరం? ఎన్ని రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయొచ్చు? సర్వే ద్వారా రైతులకు, ఇతర యజమానులకు కలిగే ప్రయోజనం ఎంత? సర్వే చేపట్టేటప్పుడు క్షేత్రస్థాయిలో నెలకొనే ఇబ్బందులేమిటి? తదితర అంశాలను అంచనా వేస్తూ, సమగ్ర నివేదికను తయారు చేస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి.. సర్వే సెటిల్మెంట్‌ ల్యాండ్‌ రికార్డ్‌ కమిషనర్‌తో సమావేశమయ్యారు. భూ సర్వే చేపట్టేందుకు నివేదికలు రూపొందించాలంటూ ఆ విభాగాన్ని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో భూ సర్వే చేపట్టి భూ రికార్డులను అప్‌డేట్‌ చేసేందుకు డీఐఎల్‌ఆర్‌ఎంపీ (డిజిటల్‌ ఇండియా ల్యాండ్‌ రికార్డు మోడ్రనైజేషన్‌) కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. అందులో భాగంగా ఆయా రాష్ట్రాలు కోరిన నిధులు కూడా మంజూరు చేస్తోంది.


ఈ కార్యక్రమం ద్వారానే సర్వే కోసం నిధులు సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు భూ సర్వే కోసం సిబ్బంది, అత్యాధునిక పరికరాలు, రికార్డుల అప్‌డేట్‌, తదితర అవసరాల కోసం దాదాపు రూ.300 కోట్లు కేటాయిస్తే, సర్వే పూర్తి చేసి రికార్డులు అప్‌డేట్‌ చేస్తామని చెప్పేందుకు సర్కారు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం భూ సర్వేకు సంబంధించి ఆయా రాష్ట్రాల సర్వే సెటిల్మెంట్‌ ల్యాండ్‌ రికార్డ్‌ కమిషనర్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించింది. ఒక్కో రాష్ట్రంలో చేపట్టిన పురోగతిని కేంద్రం అడిగి తెలుసుకుంది. మన రాష్ట్రంలోనైతే ఈ కార్యక్రమం ఇంకా పట్టాలెక్కలేదు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం భూ సర్వేపై హడావుడి చేసి మధ్యలోనే వదిలేసింది. 2017 ఆగస్టు 18న అప్పటి సీఎం కేసీఆర్‌ ‘తెలంగాణలో ప్రతి అంగుళం భూమిని కొలుస్తాం. కొలిచిన భూమికి డిజిటల్‌ మ్యాప్‌ ఆఫ్‌ తెలంగాణను తయారు చేస్తాం’ అని చెప్పారు. అనంతరం 2020 సెప్టెంబరు 9న మరోమారు భూముల సర్వే కోసం టెండర్లు పిలవాల్సి ఉందని, సభలో బిల్లులకు ఆమోదం తెలిపిన వెంటనే సర్వే కోసం ముందుకు వెళ్తామని కేసీఆర్‌ చెప్పారు.


2021 జూన్‌ 7న మంత్రివర్గ సమావేశంలో సమగ్ర భూ సర్వేపై చర్చించారు. జూన్‌ 9న డిజిటల్‌ సర్వే కోసం కొన్ని గ్రామాలను ఫైలెట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేసినట్లు ప్రకటించారు. డిజిటల్‌ భూ సర్వే చేపట్టేందుకు 29 ఏజన్సీలు ముందుకొచ్చినా అడుగు కూడా ముందుకు పడలేదు. డిజిటల్‌ భూ సర్వే ప్రక్రియ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.83.85 కోట్లు కూడా మంజూరు చేసింది. ఈ నిధుల్లో అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.2.65 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. తర్వాత ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లలో కూడా ఈ కార్యక్రమానికి నిధులు కేటాయించినా నామమాత్రంగానే ఖర్చు చేశారు. తాజాగా ఇదే విషయాన్ని సర్వే సెటిల్మెంట్‌ ల్యాండ్‌ రికార్డ్‌ కమిషనర్‌ కేంద్రానికి వివరించారు. దీంతో 2025-26 మార్చి 31 నాటికి సమగ్ర భూ సర్వే కార్యక్రమం పూర్తి చేయాలని కేంద్రం గడువు విధించింది. గత ప్రభుత్వంలో మంజూరు చేసిన నిధులకు యుటిలైజేషన్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాల్సి ఉంది. ఈ సర్టిఫికెట్‌ ఇస్తే ప్రతిపాదించిన నిధులు మొత్తం కేంద్రం మంజూరు చేసే అవకాశం కూడా ఉంది.


సర్వేతో వివాదాలకు పూర్తి పరిష్కారం

భూముల పరంగా క్షేత్రస్థాయిలో హద్దు రాళ్ల పరంగా తీవ్ర వివాదాలున్నాయి. రికార్డుల్లో పేర్కొన్నంత భూమి క్షేత్రస్థాయిలో లేకపోవడంతో కొనుగోలు, అమ్మకందారుల మధ్యన వివాదాలు నెలకొంటున్నాయి. పట్టా భూములెన్ని?, ప్రభుత్వ భూములెన్ని? అటవీ భూములెన్ని? ఎండోమెంటు భూములెన్ని? వక్ఫ్‌బోర్డు, భూదాన్‌ భూమూలెన్ని? అన్న వివరాలు రికార్డుల్లో నమోదై ఉన్నప్పటికీ క్షేత్ర స్థాయిలో వీటికి సబంధించిన హద్దులు, మ్యాప్‌లు లేవు. ఫలితంగా లక్షల సంఖ్యలో భూ వివాదాలు నెలకొన్నాయి. వీటిని సమూలంగా పరిష్కరించి కొత్త రికార్డులను రూపొందిస్తేనే భూసమస్యలు పరిష్కారమవుతాయని అభిప్రాయాలున్నాయి. సర్వే చేపడితే ప్రధానంగా ఇద్దరి వ్యక్తుల మధ్యన, దాయాదుల మధ్యన నెలకొన్న భూవివాదాలు పరిష్కారం అవుతాయి. క్షేత్రస్థాయిలో ఉన్న భూమి విస్తీర్ణం, రికార్డుల్లో నమోదు చేసిన వివరాలకు సమానంగా ఉంటే భూమికి సంబంధించిన సమస్యలే తలెత్తవు. సర్వే నిర్వహిస్తే రికార్డుల అప్‌డేట్‌ కూడా జరిగిపోతుంది. ఏళ్ల తరబడి కోర్టులో కొనసాగుతున్న పలు భూ వివాద కేసులు కూడా తగ్గిపోతాయి. అంతే కాకుండా అటవీ, రెవెన్యూ శాఖల సరిహద్దుల్లోని భూముల వివాదాలకు పరిష్కారం దొరుకుంది. రాష్ట్రాల సరిహద్దుల వివాదాలు, గ్రామాలు, జిల్లాల మధ్యన నెలకొన్న సరిహద్దు వివాదాలు పరిష్కారమవుతాయి.


రూల్స్‌ప్రకారం ప్రతి 30 ఏళ్లకోసారి..

నిబంధనల ప్రకారం ప్రతి 30 ఏళ్లకోసారి రెవెన్యూ రికార్డుల నవీకరణ జరగాలి. అప్పుడే ఎవరు యజమానులో తేలిపోతుంది. పారదర్శకంగా రైతుబంధు, రుణాల పంపిణీ, రుణమాఫీ, బీమా, భూముల సేకరణ వంటి అంశాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారమవుతాయని రెవెన్యూ నిపుణులు చెబుతున్నారు. నిరంతర ప్రక్రియగా రీ-సర్వే జరగాలి. నిజాం రాజుల కాలంలోనే 1936-42 కాలంలో సమగ్ర భూముల సర్వే జరగ్గా, హైదరాబాద్‌తో పాటు పట్టణాల్లో 1972 టౌన్‌ సర్వే జరిగింది. ప్రతి భూమి పది మంది కంటే తక్కువ కాకుండా చేతులు మారినప్పటికీ రికార్డుల నవీకరణ జరుగలేదు. తెలంగాణ వ్యాప్తంగా 32 జిల్లాల్లో (హైదరాబాద్‌ కాకుండా) 1.64 కోట్ల సర్వేనంబర్లు/సబ్‌ డివిజన్లుండగా 74 లక్షల మంది పట్టాదారులున్నారు. భూముల సరిహద్దు పత్రా(టిప్పన్‌)లు కూడా 75 ఏళ్ల పాతవే. ఒకసారి భూములు కొలవడానికి ఈ పత్రాలు తీయగానే చిరిగిపోతుంటాయని మండల సర్వేయర్లు వాపోతున్నారు. రీ సర్వే చేపడితే రికార్డులన్నీ అవుతాయని సూచిస్తున్నారు.


పట్టాదారుకు భూ ఆధార్‌ జారీ

భూములు సర్వే చేసిన అనంతరం సంబంఽధిత యజమానికి 14 అంకెలతో కూడిన భూ ఆధార్‌ నంబరును జారీ చేస్తారు. ఈ నంబరు ద్వారా ఆ భూమికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ నంబరును ఆన్‌లైన్‌లో కొడితే యజమాని పేరు, భూమి విస్తీర్ణం, భూమి స్వభావం, అక్షాంశాలు, రేఖాంశాల సహితంగా హద్దులు తెలుస్తాయి.

Updated Date - May 25 , 2024 | 05:11 AM