భద్రకాళి ఆలయానికి భద్రత ఏదీ..?
ABN , Publish Date - Mar 04 , 2026 | 09:57 AM
నిత్యం భక్తులతో కిటకిటలాడే వరంగల్ నగరంలోని చారిత్రక భద్రకాళి అమ్మవారి దర్శనానికి భక్తుల తాకిడి రోజు రోజుకూ పెరుగుతోంది.
రోజువారీ పెరుగుతున్న భక్తుల రద్దీ
ఆలయంలోనే విలువైన వస్తువులు, ఆభరణాలు
వర్తించని దేవాదాయ శాఖ నిబంధనలు
వరంగల్: నిత్యం భక్తులతో కిటకిటలాడే వరంగల్ నగరంలోని చారిత్రక భద్రకాళి అమ్మవారి దర్శనానికి భక్తుల తాకిడి రోజు రోజుకూ పెరుగుతోంది. వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు అమ్మవారికి మరింత వన్నె తెచ్చే విధంగా తమ శక్తి కొలది అలంకరణ వస్తువులు, ఆభరణాలు బహుకరిస్తున్నారు. కోట్లాది రూపాయల ఆభరణాలు, పూజ సామగ్రి, అలంకరణ సామగ్రి అమ్మవారికి ఉండడంతో భద్రకాళి దేవస్థానానికి పోలీసు భద్రత తప్పనిసరి. దేవాదాయ శాఖ నిబంధనల మేరకు రాష్ట్రంలోని అన్ని పెద్ద దేవాలయాల వద్ద ప్రభుత్వం పోలీసు భద్రతను ఏర్పాటు చేసింది. కానీ వరంగల్లోని భద్రకాళి అమ్మవారి దేవాలయంలో మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి భద్రత సిబ్బంది లేరు.
తూతూ మంత్రంగా సెక్యూరిటీ ఏర్పాటు
ఇటీవల పెన్నా సిమెంట్ అధినేత కుమార్తె అమ్మవారికి దాదాపు రూ.5 కోట్ల విలువ చేసే వెండి, బంగారు ఆభరణాలను దేవస్థానానికి అందించారు. గతంలో కూడా అమ్మవారి అభిషేకానికి ఉపయోగించే వెండి కలశం చంబులు, బంగారు కలశం చంబులు అందించారు. ఇవేకాకుండా అమ్మవారికి భక్తులు సమర్పించిన నగలు, గతంలో ఉన్న నగలు కూడా పూజ సామగ్రి కూడా ఆలయంలో ఉన్నాయి. దీంతో ఆలయ ఈవో, ధర్మకర్తలు అమ్మవారి నగలు, భక్తుల రద్దీ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఈమేరకు పోలీసు కమిషనర్కు ఈవో విన్నవించారు. స్పందించిన కమిషనర్ వారంపాటు ఇద్దరు పోలీసు సిబ్బంది భద్రత ఏర్పాటు చేశారు. అనంతరం భద్రత తొలగించారు. దీంతో కోట్లాది రూపాయల ఆభరణాలు కలిగిన అమ్మవారి దేవాలయంలో భద్రత లేకుండా పోయింది. అనుకోని సంఘటనలు ఏవైనా జరిగితే బాధ్యులు ఎవరని భక్తులు ప్రశ్నిస్తున్నారు.
వర్తించని దేవాదాయ శాఖ నిబంధనలు
దేవాదాయ శాఖకు సంబంధించి పెద్ద దేవాలయాల్లో ఈవో, సూపరింటెండెంట్, అర్చకులు, ధర్మకర్తలు, చైర్మన్ల విధి విధానాలు ఉంటాయి. ఆలయంలో నియమ నిబంధనలను పాటించవలసి ఉంటుంది. కానీ అమ్మవారి ఆలయంలో ప్రభుత్వ నియమ నిబంధనలు వర్తించడం లేదంటూ, ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా కొనసాగిస్తున్నారంటూ భక్తులు విమర్శిస్తున్నారు. భద్రకాళి దేవస్థానంలో కూడా పెద్ద దేవాలయాల్లోని విధంగా నియమ నిబంధనలు అమలు చేయాలని భక్తులు కోరుతున్నారు.
ఇష్టారీతిన దర్శనాలు
ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు భక్తులను తీసుకొచ్చి వీఐపీ దర్శనం చేయించడం, కండువాలు కప్పడం, ప్రసాదాలు ఇవ్వడం జరుగుతోంది. అమ్మవారి దర్శనానికి ఇటీవల సినీ నటుల రాక పెరిగింది. వారి రాకకు సంబంధించి అధికారికంగా ఈవోకు సమాచారం ఉండడం లేదు. ప్రైవేటు అర్చకుల పెత్తనంతో ప్రతీ ఒక్కరికి ప్రొటోకాల్ దర్శనం, ప్రసాదాలు, కండువాలు అందిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News