Share News

టీ20 డబ్ల్యూసీ: ఆ ఇద్దరితో సంజుకు ముప్పు తప్పదా?

ABN , Publish Date - Mar 04 , 2026 | 07:46 AM

టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్-8లో భాగంగా వెస్టిండీస్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సంజు శాంసన్‌ వీరోచిత ఇన్నింగ్స్‌‌తో రాణించడంతో భారత్ సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లో కూడా అందరూ సంజుపైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో..

టీ20 డబ్ల్యూసీ: ఆ ఇద్దరితో సంజుకు ముప్పు తప్పదా?
India vs England

స్పోర్ట్స్ డెస్క్: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌(T20 World Cup 2026) టోర్నీ నాకౌట్‌ దశకు చేరుకుంది. నేడు(బుధవారం) సౌతాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య తొలి సెమీ ఫైనల్ జరగనుంది. అలానే రేపు(గురువారం) ముంబై వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో సెమీ ఫైనల్ జరగనుంది. సూపర్-8లో భారత్ అద్భుత ప్రదర్శనతో చివరి సమయంలో సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. వెస్టిండీస్‌తో తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో సంజు శాంసన్‌ వీరోచిత ఇన్నింగ్స్‌ (50 బంతుల్లో 97 నాటౌట్‌)తో రాణించడంతో భారత్ సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లో కూడా అందరూ సంజుపైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో అతడికి ఇద్దరు బౌలర్లతో ప్రమాదం పొంచి ఉందని క్రీడా నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.


వెస్టిండీస్ మ్యాచ్‌లో అదరగొట్టిన సంజుకు ఇంగ్లండ్‌తో జరగనున్న మ్యాచ్‌లో మాత్రం జోఫ్రా ఆర్చర్‌(Jofra Archer) రూపంలో ప్రమాదం పొంచి ఉంది. గతేడాది అంతర్జాతీయ టీ20లలో ఈ ఇంగ్లీష్ పేసర్‌ సంజూను బాగా ఇబ్బంది పెట్టాడు. శాంసన్‌కు జోఫ్రా 23 డెలివరీలు సంధించగా.. అతడు కేవలం 25 పరుగులే సాధించాడు. ఇందులో ఒక ఫోర్‌, రెండు సిక్స్‌లు మాత్రమే ఉన్నాయి. అలానే ఆర్చర్‌ బౌలింగ్‌లో సంజు మూడు సార్లు అవుటయ్యాడు. ఒకవేళ ఇంగ్లండ్ ఆర్చర్‌తోనే బౌలింగ్ ఆరంభిస్తే.. ఓపెనర్‌గా దిగే సంజు మాత్రం చాలా జాగ్రత్త ఆడాల్సి ఉంటుంది. లేదంటే మాత్రం భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుందని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


జోఫ్రాతో పాటు మరో బౌలర్ సామ్‌ కరన్‌(Sam Curran) కూడా సంజుకు సవాలు విసిరే అవకాశం ఉంది. గత నాలుగేళ్లలో పొట్టి క్రికెట్ మ్యాచ్‌ల్లో సామ్‌.. సంజుకు 16 డెలివరీలు సంధించగా.. అతడు 21 పరుగులు చేయగలిగాడు. రెండుసార్లు అవుటయ్యాడు. ఈ ప్రమాదాల్ని అధిగమిస్తేనే సంజు...భారత జట్టుకు మంచి ఆరంభం ఇవ్వగలడు. ఈ ఇద్దరి బౌలర్లతో సంజుకు ఉన్న గత గణాంకాలను బట్టి.. అతడి తుది జట్టులో ఆడిస్తారా?.. ఒకవేళ ఆడించినా ఓపెనర్‌గా పంపుతారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సంజుపై నమ్మకం ఉంచిన టీమిండియా మేనేజ్‌మెంట్‌ వెస్టిండీస్‌తో ఆడిన జట్టుతోనే ముందుకు వెళ్లనున్నట్లు సమాచారం. తుదిజట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే భారత్‌.. ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్‌ ఆడనున్నట్లు తెలుస్తోంది.

వెస్టిండీస్‌తో ఆడిన భారత తుది జట్టు

సంజు శాంసన్‌, అభిషేక్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్య, శివం దూబె, అక్షర్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, వరుణ్‌ చక్రవర్తి, జస్ప్రీత్‌ బుమ్రా


ఇవి కూడా చదవండి:

తొలి అడుగు.. ఎవరిదో?

మ్యాచ్‌ రద్దయితే మనం ఇంటికే!

Updated Date - Mar 04 , 2026 | 08:24 AM