ఎంజీఎంలో కారుణ్య నియామకాలేవీ?
ABN , Publish Date - Aug 05 , 2026 | 10:03 AM
ఎంజీఎం ఆస్పత్రిలో కారుణ్య నియామకాల కోసం పలువురు అభ్యర్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అలాగే నాలుగో తరగతి సిబ్బందికి పదోన్నతులు లేకుండా ఏళ్లు గడుస్తున్నాయి.
వరంగల్: ఎంజీఎం ఆస్పత్రిలో కారుణ్య నియామకాల కోసం పలువురు అభ్యర్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అలాగే నాలుగో తరగతి సిబ్బందికి పదోన్నతులు లేకుండా ఏళ్లు గడుస్తున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో ఖాళీలు దర్శనమిస్తున్నాయి. పడకల సంఖ్య పెరిగినా సిబ్బంది సంఖ్యను పెంచకపోవడంపట్ల పనిభారం ఎక్కువవుతోంది. ఎంజీఎం ఆస్పత్రిలో 500 పడకలు ఉన్నప్పుడు కేటాయించిన పోస్టులే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఆసుపత్రిని అప్ గ్రేడ్ చేసినా పడకల సంఖ్యను మాత్రమే పెంచి సిబ్బంది సంఖ్యను పెంచకపోవడం పట్ల పని భారం ఎక్కువ అవుతుందని ఉద్యోగులు వాపోతున్నారు.
ఎంజీఎం ఆసుపత్రిలో ఇప్పటికే 8 జూనియర్ అసిస్టెంట్ ఖాళీలు, 11 సీనియర్ అసిస్టెంట్ ఖాళీలు, 50కి పైగా నాలుగో తరగతి సిబ్బంది ఖాళీలు ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఎంజీఎం ఆస్పత్రిలో నాలుగవ తరగతి సిబ్బందికి జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అర్హతలు అన్నీ ఉండి కూడా పదోన్నతుల కోసం సంవత్సరాలుగా నిరీక్షిస్తున్నారు. కొందరు పదోన్నతులు లేకుండానే పదవి విరమణ కూడా పొందుతున్నారు.
ఉద్యోగి మరణించిన, మెడికల్ గ్రౌండ్లో పదవి విరమణ చేసిన వారి వారసులకు ఇవ్వాల్సిన కారుణ్య నియామకాలు గత కొన్ని సంవత్సరాలుగా నిలిచిపోయాయి. ఎంజీఎం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయినా అధికారులు కనికరించకపోవడం పట్ల సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు తమ కుటుంబాన్ని పోషించలేక కన్నీటి పర్యంతమవుతున్నారు. కాగా, సగానికి పైగా ఖాళీలు ఉన్నప్పటికీ, ఉద్యోగులపై పనిభారం ఉన్నప్పటికీ ఉద్యోగ సంఘాల నేతలు నోరు మెదపడం లేదని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు. కారుణ్య నియామకాల కోసం అభ్యర్థులు ఎంజీఎం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
కల్తీ మసాలాలపై చర్యలు.. అంతర్రాష్ట్ర ముఠాలపై సిట్ ఫోకస్
Read Latest AP News And Telangana News And International News And Telugu News