అమ్మా.. ఎట్లున్నవే?
ABN , Publish Date - Apr 22 , 2026 | 11:40 AM
ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని స్వగ్రామానికి వచ్చారు.
తల్లిని పలకరించిన మాజీ మావోయుస్టు దామోదర్
30 ఏళ్ల తర్వాత స్వగ్రామానికి..
కుటుంబ సభ్యులను కలిసి భావోద్వేగం
తాడ్వాయి(ములుగు): ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని స్వగ్రామానికి వచ్చారు. అజ్ఞాత వాసం వీడాక 30 ఏళ్ల తర్వాత తొలిసారిగా మంగళవారం కాల్వపల్లికి వచ్చారు. తల్లి బతుకుమ్మను చూసి భావోద్వేగానికి గురయ్యారు. చూపు మందగించినా కొడుకు పిలుపుతో బతుకమ్మ కొడుకు రాకతో మురిసిపోయింది. తల్లిని చూడ్డంతోనే దామోదర్ ‘అమ్మా.. నేను నీ కొడుకు చొక్కారావును’ అని పలకరించడంతో ఒక్కసారిగా ఆనందంతో మైమరచిపోయింది. ‘అమ్మా.. ఆరోగ్యం ఎట్టున్నదే..?’ అని తల్లిని దామోదర్ హత్తుకున్నారు.
కుటుంబ సభ్యులందరినీ పేరుపేరునా ఆయన పలకరించారు. దామోదర్ వచ్చారనే విషయం తెలుసుకున్న గ్రామస్థులు భారీ సంఖ్యలో ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. వారిని చూసిన దామోదర్ ఎంతో ఆప్యాయంగా పలకరించారు. గ్రామస్థుల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్థులు ఆయన్ను సన్మానించారు. యువత ఆయనతో సెల్ఫీలు దిగారు.
అనంతరం దామోదర్ విలేకరులతో మాట్లాడుతూ 30 ఏళ్లుగా ఉద్యమంలో ఆటుపోట్లు ఎదుర్కొని ప్రజా సమస్యలపై అలుపెరగని ఉద్యమాలు చేశానన్నారు. పార్టీ సిద్ధాంతాలు అనుసరిస్తూ ముందుకు సాగానన్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చి తన తల్లి బతుకమ్మను, కుటుంబ సభ్యులను, గ్రామస్థులను కలువడం సంతోషంగా ఉందన్నారు. ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
అల్లు అర్జున్కు ఊరట.. ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
Read Latest Telangana News and National News