Share News

తెలంగాణ నుంచి 8 కొత్త రైళ్లు

ABN , Publish Date - Apr 22 , 2026 | 04:33 AM

రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని వివిధ స్టేషన్ల నుంచి ఎనిమిది కొత్త రైళ్లను ప్రకటించింది.

తెలంగాణ నుంచి 8 కొత్త రైళ్లు

  • తిరుపతి, తిరుచానూరు, శీగంగానగర్‌, జైపూర్‌, భువనేశ్వర్‌లకు సర్వీసులు

  • రైల్వేశాఖ ప్రకటన.. కిషన్‌రెడ్డి హర్షం

  • ఇప్పటిదాకా ఈ ప్రత్యేక రైళ్లన్నీ ఇక రెగ్యులర్‌ రైళ్లు

  • రైల్వే అధికారుల వెల్లడి

న్యూఢిల్లీ, హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని వివిధ స్టేషన్ల నుంచి ఎనిమిది కొత్త రైళ్లను ప్రకటించింది. కాచిగూడ, చర్లపల్లి, నాంపల్లి స్టేషన్ల నుంచి ఏపీలోని తిరుపతి, తిరుచానూరు, రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌, జైపూర్‌, ఒడిశాలోని భువనేశ్వర్‌కు కొత్త రైళ్లను నడనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ తెలిపిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. వీటిలో తిరుపతి, తిరుచానూరు వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులకోసం 5 రైళ్లు కొత్తగా అందుబాటులోకి రానున్నాయి. దీంతోపాటుగా భువనేశ్వర్‌, జైపూర్‌, శ్రీగంగానగర్‌ వంటి సుదూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు లబ్థి చేకూరనుంది. రైల్వే శాఖ నిర్ణయం పట్ల ఎక్స్‌ వేదికగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. కాగా ఇప్పటికే ఈ ప్రత్యేక రైళ్లు ఆయా ప్రాంతాల నుంచి నడుస్తున్నాయని, ఈ ప్రత్యేక రైళ్లను రెగ్యులర్‌ రైళ్లుగా మార్చాలని రైల్వేశాఖ నిర్ణయించిందని రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రత్యేక రైళ్లు రెగ్యులర్‌ రైళ్లుగా మారడంతో ప్రయాణికులపై అదనపు చార్జీల భారం ఉండదని వెల్లడించారు.

Updated Date - Apr 22 , 2026 | 06:27 AM