‘భూభారతి’కి బ్రేక్..
ABN , Publish Date - Aug 25 , 2026 | 10:52 AM
మహబుబాబాద్ జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల్లో ‘భూభారతి’ పోర్టల్ ద్వారా కొనసాగే వ్యవసాయ భూముల రిజిస్ర్టేషన్లు 2 వారాలకు పైగా నిలిచిపోయాయి.
జూనియర్ అసిస్టెంట్లకు బాధ్యతలు అప్పగింత
జేఏలకు లాగిన్ ఐడీల జారీలో జాప్యం
2 వారాలుగా దరఖాస్తుదారుల పడిగాపులు
తగ్గిన ప్రభుత్వ ఆదాయం
కేసముద్రం(మహబుబాబాద్): మహబుబాబాద్ జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల్లో ‘భూభారతి’ పోర్టల్ ద్వారా కొనసాగే వ్యవసాయ భూముల రిజిస్ర్టేషన్లు 2 వారాలకు పైగా నిలిచిపోయాయి. ఆయా కార్యాలయాల్లో ఆపరేటర్లు లేకపోవడంతో ఈ రిజిస్ట్రేషన్లు బంద్ కాగా ప్రభుత్వానికి ఫీజురూపంలో రావాల్సిన ఆదాయం నిలిచిపోయింది. జిల్లాలో 18 తహసీల్దార్ కార్యాలయాల్లో ఈ పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు, బహుమతి, వారసత్వ బదిలీ లు, తనఖా రిజిస్ట్రేషన్లు, వ్యవసాయేతర భూములుగా మార్చడం వంటి సేవలు కొనసాగేవి. రోజుకు ఒక్కో కార్యాలయంలో సగటున 4 నుంచి 5 వరకు సుమారు 70 వరకు వివిధ రకాల రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి.
ఇందుకోసం ప్రతీ తహసీల్దార్ కార్యాలయంలో ఔట్సోర్సింగ్ పద్థతిలో భూభారతి (గతంలో ధరణి) ఆపరేటర్ను ప్రభుత్వం నియమించింది. అయితే తాత్కాలిక పద్థతిన పని చేస్తున్న ఈ ప్రైవే ట్ ఆపరేటర్లతో పలుచోట్ల అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపణలతో వారిని పూర్తిగా తొలగించారు. అదే స్థానంలో ప్రభుత్వ ఉద్యోగులైన జూనియర్ అసిస్టెంట్లకు భూభారతిలో రిజిస్ట్రేషన్ల పనిని అప్పగించేందుకు ప్రభుత్వం నిర్ణయించారు. ఈ మేరకు ఏడేళ్లుగా కొనసాగుతున్న ఈ ఆపరేటర్లను ఉన్నఫలంగా రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది.
ఈనెల మొదటి వారం నుంచే..
జిల్లాలో ఈనెల 8న ఆపరేటర్లను తొలగించగా అంతకు నాలుగైదు రోజుల ముందు నుంచే పలు మండలాల్లో ‘భూ భారతి’ సేవలు బంద్ అయ్యాయి. రిజిస్ట్రేషన్ల కో సం స్లాట్లు బుక్ చేసుకున్నవారు తహసీల్దార్ కార్యాలయా ల చుట్టూ తిరుగుతున్నారు. వివిధ రకాల రిజిస్ట్రేషన్ల కోసం కొనుగోలు, విక్రయదారులు, సాక్షులంతా కార్యాలయానికి వస్తూ ‘భూభారతి’ పరిస్థితి తెలుసుకొని ఉసూరుమం టూ వెళ్తున్నారు. ఈ రిజిస్ట్రేషన్లు మళ్లీ ఎప్పుడు ప్రారంభిస్తారనేది కార్యాలయంలో అడిగితే ప్రతిరోజూ రేపే అని సమాధానం ఇస్తున్నారని అర్జీదారులు చెబుతున్నారు. మరోవైపు రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో కొత్తస్లాట్ బుక్ చేసుకునేందుకు పలువురు వెనుకాడడంతో
ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఆగిపో యింది. ఈ విషయంపై కేసముద్రం తహసీల్దార్ జి.వివేక్ను ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. జూనియర్ అసిస్టెంట్లకు లాగిన్ ఐడీలు జారీ చేసే ప్రక్రియ కొనసాగుతోందని, ఈ ఐడీలు రాగానే రిజిస్ట్రేషన్లు యథావిధిగా ప్రారంభమవుతాయని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే తహసీల్దార్ కార్యాలయాల్లో ‘భూభారతి’ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, ఇతర సేవలను వెంటనే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని స్లాట్బుక్ చేసుకున్న వారు కోరుతున్నారు.
శిక్షణ ఇచ్చినా..
‘భూభారతి’ ఆపరేటర్లను తొలగించిన తర్వాత రిజిస్ట్రేషన్కు ఆటకం కలుగకుండా జూనియర్ అసిస్టెంట్లకు సాంకేతిక శిక్షణ కూడా ఇచ్చారు. స్లాట్ బు కింగ్, భూముల వివరాల నమోదు, హక్కుల మార్పిడి, క్రయవిక్రయాలు, వారసత్వ, మార్టిగేజ్ తదితర సేవలపై వారికి సమగ్రంగా అవగాహన కల్పించారు. ప్రభుత్వ ఉద్యోగులే ఆపరేటర్లుగా వ్యవహరిస్తుండడంతో ఏదైనా అక్రమం, పొరపాటు జరిగితే నేరుగా వారి పైనే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. జిల్లాలోని 18 మండలాల్లో జూనియర్ అసిస్టెంట్లకు శిక్షణనిచ్చారు. అయితే వారికి భూభారతికి సంబంధించిన లాగిన్ ఐడీలు జారీ చేయడంలో జాప్యం జరుగుతోంది. ఫలితంగా జిల్లాలో రెండు, మూడు తహసీల్దార్ కార్యాల యాల్లో పాత ఆపరేటర్లతో తాత్కాలికంగా ‘భూభారతి’ సేవలను కొనసాగిస్తుండగా ఇవి మినహా అన్ని చోట్ల ఈ-పోర్టల్ సేవలు నిలిచిపోయాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
కరువు పరిస్థితుల్లో.. కూరగాయల సాగుకు మొగ్గు
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest AP News And Telangana News And International News And Telugu News