ఎయిడ్స్ నియంత్రణలో భేష్..‘వికారాబాద్’కు జాతీయ స్థాయి గుర్తింపు
ABN , Publish Date - Jul 09 , 2026 | 12:01 PM
హెచ్ఐవీ/ఎయిడ్స్ నివారణ, నియంత్రణ, చికిత్సలో విశిష్ట పనితీరు కనబర్చినందుకు వికారాబాద్ జిల్లాకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది.
జిల్లాకు ‘సక్షం’ సర్టిఫికెట్ జారీ
జిల్లాలో 4,536 మంది హెచ్ఐవీ బాధితులు
వికారాబాద్: హెచ్ఐవీ/ఎయిడ్స్ నివారణ, నియంత్రణ, చికిత్సలో విశిష్ట పనితీరు కనబర్చినందుకు వికారాబాద్ జిల్లాకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను సాధించినందుకు గాను సక్షం సర్టిఫికెట్ ప్రకటించారు. దేశ వ్యాప్తంగా కేవలం 70 జిల్లాలు మాత్రమే భారత ప్రభుత్వం, జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ నిర్దేశించిన ప్రమాణాలను పూర్తి చేయగా, వాటిలో వికారాబాద్ జిల్లాకు చోటు దక్కింది.
95శాతం గుర్తింపు
జిల్లాలో హెచ్ఐవీతో జీవిస్తున్న వ్యక్తుల్లో కనీసం 95 శాతం మందికి తమ స్థితిని గుర్తించే లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో 4,536 మంది హెచ్ఐవీ బాధితులను గుర్తించి వారందరికీ ఉచితంగా యాంటీ రెట్రో వైరల్ థెరఫీ అందిస్తున్నట్లు వెల్లడించారు. హెచ్ఐవీని ముందస్తుగా గుర్తించడం నిర్ధారణ అయిన వెంటనే టెస్ట్ అండ్ ట్రీట్ విధానంలో చికిత్స ప్రారంభించడం, రోగులకు నిరంతర కౌన్సెలింగ్, ఫాలో అప్ సేవలు అందించడం ద్వారా ఈ లక్ష్యాలను సాధించినట్లు అధికారులు తెలిపారు. హెచ్ఐవీతో జీవిస్తున్న ప్రతీ వ్యక్తి క్రమం తప్పకుండా ఏఆర్టీ మందులు తీసుకోవడం వల్ల ఆరోగ్యవంతమైన జీవితం గడపడమే కాకుండా, ఇతరులకు వ్యాధి సంక్రమించే ప్రమాదం కూడా తగ్గుతుందని అధికారుల చెబుతున్నారు.
అపోహలు, భయాలు వీడాలి
ప్రజలు హెచ్ఐవీపై ఉన్న అపోహలు, భయాలు, వివక్షను వీడాలి. సమీప ప్రభుత్వ ఆసుపత్రి లేదా ఐసీటీసీ కేంద్రంలో ఉచితంగా పరీక్షలు చేయించుకుని, అవసరమైతే వెంటనే చికిత్స ప్రారంభించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు సహకరించాలి.
దీపక్ తివారీ, కలెక్టర్, వికారాబాద్
ఈ వార్తలు కూడా చదవండి:
తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు
మరింతగా తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..
Read Latest AP News And Telangana News And International News And Telugu News