Schools Gate Locked in Telangana: స్కూళ్ల గేట్లకు తాళాలు.. విద్యార్థుల అగచాట్లు..
ABN , Publish Date - Jan 19 , 2026 | 01:12 PM
యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లోని ప్రభుత్య పాఠశాలలకు కాంట్రాక్టర్లు తాళాలు వేశారు. మన ఊరు - మన బడి నిర్మాణ భవనానికి సంబంధించిన బిల్లులు రాక పోవడంతో కాంట్రాక్టర్లు ఈ చర్యలకు పాల్పడ్డారు.
భువనగిరి/నాగర్ కర్నూల్, జనవరి 19: ప్రభుత్వ అధికారుల అలసత్వం.. రాజకీయ పార్టీల నిర్లక్ష్యం.. స్థానిక నేతల కమీషన్ల కక్కుర్తి.. ఇలా వీటిలో ఏదో ఒకటి బలంగా పని చేస్తోంది. వాటి కారణంగా విద్యార్థులు, వారికి విద్య నేర్పిన ఉపాధ్యాయులు తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. తాజాగా.. తెలంగాణలోని రెండు జిల్లాల్లో దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది.
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ సర్పంచ్ కీసరి రాంరెడ్డి అదనపు భవన నిర్మాణం చేపట్టారు. ఆ నిధులకు సంబంధించిన నగదు నేటికీ ఆయన చేతికి అందలేదు. నిధుల కోసం ఆయన పలుమార్లు ప్రభుత్వ కార్యాలయాలకు చెప్పులరిగేలా తిరిగారు. కానీ వారి నుంచి కనీస స్పందన లేకుండా పోయింది.

దీంతో ఆగ్రహించిన రాంరెడ్డి.. సోమవారం ఆ పాఠశాల గేటుకు తాళం వేశారు. సంక్రాంతి సెలవులు ముగించుకుని పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు ఆ గేటుకు తాళం ప్రత్యక్షమైంది. దీంతో పాఠశాల గేటు ముందు వారంతా గంటల తరబడి నిలబడి ఉన్నారు. అలాగే ఉపాధ్యాయులు సైతం వారితో కలిసి అక్కడే నిల్చోవాల్సి వచ్చింది. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని.. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని వారు విజ్ఞప్తి చేశారు.
మరోవైపు.. నాగర్ కర్నూల్ జిల్లా కోడెర్ ప్రభుత్య పాఠశాలకు కాంట్రాక్టర్లు తాళం వేశారు. మన ఊరు - మన బడి నిర్మాణ భవనానికి సంబంధించిన బిల్లులు రాలేదంటూ పాఠశాల గేటుకు వారు తాళం వేశారు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు గంటల పాటు గేటు బయటే నిరీక్షించారు. ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ఎంఈఓ భాస్కర్ శర్మ జోక్యం చేసుకుని.. పాఠశాల కాంట్రాక్టర్లతో మాట్లాడారు. ఆ తర్వాత పాఠశాల గేటుకు వేసిన తాళాన్ని తొలగించారు. అనంతరం.. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులూ పాఠశాలల్లోని తరగతి గదులకు వెళ్లారు. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన నగదు వెంటనే చెల్లించాలని.. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వానికి విద్యార్థుల తల్లిదండ్రులు సూచిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కవితతో ప్రశాంత్ కిషోర్ వరుస భేటీలు..
శ్రీపంచమి వేళ విద్యార్థులకు గుడ్ న్యూస్.. జస్ట్ చిన్న కండిషన్
For more TG News And Telugu News