Share News

మీసేవలో డిజిటల్‌ రసీదులు

ABN , Publish Date - Jun 26 , 2026 | 11:48 AM

మీసేవ కేంద్రాల్లో సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఇచ్చే కాగితపు రసీదులకు కాలం చెల్లింది.

మీసేవలో డిజిటల్‌ రసీదులు
MeeSeva digital receipts

  • ఇక కాగితపు రసీదులకు స్వస్తి

  • మొబైల్‌కే అక్నాలెడ్జ్‌మెంట్‌ హైపర్‌లింక్‌

  • పొరపాటున డిలీట్‌ అయితే రీసెండ్‌

సిద్దిపేట: మీసేవ కేంద్రాల్లో సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఇచ్చే కాగితపు రసీదులకు కాలం చెల్లింది. పారదర్శకమైన, వేగవంతమైన పేపర్‌లెస్‌ పాలనలో భాగంగా జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. ఎలకా్ట్రనిక్‌ సర్వీస్‌ డెలివరీ (మీసేవ) కమిషనర్‌ ఆదేశాల మేరకు, ఈ నెల 19 నుంచి కాగితపు రసీదుల స్థానంలో డిజిటల్‌ రసీదుల విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. జిల్లాలోని 192 మీసేవ కేంద్రాల్లో ఇకపై కాగితపు ప్రింట్లు ఇవ్వకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.


మొబైల్‌కే అక్నాలెడ్జ్‌మెంట్‌ లింక్‌

కొత్త విధానంలో భాగంగా, దరఖాస్తుదారులు ఇకపై తమ మొబైల్‌ నంబర్లను మీసేవ ఆపరేటర్లకు స్పష్టంగా అందించాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన వెంటనే, దరఖాస్తుదారుని రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ ద్వారా ఒక హైపర్‌లింక్‌ చేరుతుంది. అందులో అప్లికేషన్‌ నంబర్‌, సేవ పేరు, చెల్లించిన ఫీజు వంటి పూర్తి వివరాలు ఉంటాయి. పౌరులు ఆ లింక్‌పై క్లిక్‌ చేసి తమ రసీదును ఎప్పుడైనా వీక్షించవచ్చు, డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు లేదా అవసరమైతే ప్రింట్‌ తీసుకోవచ్చు. సర్టిఫికెట్‌ చేతికి అందే వరకు ఈ ఎస్‌ఎంఎస్‏ను సురక్షితంగా ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.


srd1.jpgరీసెండ్‌ సౌకర్యం అందుబాటులో

మొబైల్‌కు వచ్చిన ఎస్‌ఎంఎస్‌ పొరపాటున డిలీట్‌ అయినా లేదా సాంకేతిక కారణాలతో పోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. మీసేవ అప్లికేషన్‌లో అటువంటి ఎస్‌ఎంఎ్‌సను తిరిగి పంపించే వెసులుబాటును అందుబాటులోకి తెచ్చారు. దరఖాస్తుదారులు కోరితే, సంబంధిత మీసేవ ఆపరేటర్లు మళ్లీ ఆ మెసేజ్‌ను పంపేలా సాంకేతిక సహాయం అందిస్తారు. జిల్లాలో నెలకు సుమారు 6 వేల వరకు క్యాస్ట్‌, ఇన్కమ్‌ వంటి సర్టిఫికెట్ల కోసం వచ్చే దరఖాస్తుదారులకు ఈ డిజిటల్‌ విధానం ఎంతో మేలు చేకూర్చనుంది.


మీ సేవ కేంద్రాల్లో పేపర్‌ రసీదుకు స్వస్తి

మీ సేవ కేంద్రాల్లో పేపర్‌ రసీదు ఇచ్చే పద్ధతికి స్వస్తి పలుకుతున్నాం. కాగిత రహిత పాలనే ధ్యేయంగా నూతన విధానం అమలు చేస్తున్నాం. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఇప్పటికే మీ సేవ కేంద్రాల నిర్వాహకులకు అందజేశాం. దరఖాస్తుదారులు స్కాన్‌ చేసి తమ పత్రాలతో మీసేవ నిర్వాహకులు దరఖాస్తు చేస్తారు. దరఖాస్తుదారులు పత్రాలను తిరిగి ఆ కార్యాలయాల్లో ఇవ్వకూడదు. ఆన్‌లైన్‌లో చూసి అధికారులే నిర్ణీత సమయానికి మీ సర్టిఫికెట్‌ను మంజూరు చేస్తారు.

  • ఆనంద్‌, ఈ డిస్టిక్‌ మేనేజర్‌


ఈ వార్తలు కూడా చదవండి:

భూ భారతి ఆపరేటర్లకు వేతన కష్టాలు

మక్కలు క్వింటా రూ.2,430

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 26 , 2026 | 11:48 AM