పాలు లేకుండానే కోవా తయారీ
ABN , Publish Date - Sep 11 , 2026 | 01:25 PM
పాలతో తయారు చేయాల్సిన స్వీట్లను అసలు పాలు లేకుండా తయారు చేస్తున్న ఓ స్వీటు షాపు బండారం బయటపడింది.
మూడు జిల్లాలకు సరఫరా
స్వీట్ షాప్, రెస్టారెంట్, హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు
కరీంనగర్ క్రైం: పాలతో తయారు చేయాల్సిన స్వీట్లను అసలు పాలు లేకుండా తయారు చేస్తున్న ఓ స్వీటు షాపు బండారం బయటపడింది. మరో హోటల్లో లైసెన్స్ లేకుండానే ఆహారపదార్థాలను తయారు చేసి విక్రయిస్తున్నారు. ఇలా నిబంధనలు ఉల్లంఘించి, హానికరమైన రసాయనాలు, ఇతర ముడి పదార్థాలతో ఆహార పదార్థాలను తయారు చేస్తున్న ఆయా సంస్థల లైసెన్స్లు రద్దు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు షాపులను సీజ్ చేశారు. కరీంనగర్ గెజిటెడ్ ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ రోహిత్రెడ్డి వివరాల ప్రకారం... కరీంనగర్లోని పలు స్వీట్ హౌజ్లు, రెస్టారెంట్లు, హోటళ్లపై కరీంనగర్ ఫుడ్ సేఫ్టీ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు.
కొత్తపల్లి మండలం బావుపేటలోని శ్రీబాలాజీ మ్యాజిక్ మిఠాయి పేరిట నిర్వ హిస్తున్న స్వీట్ హౌస్లో పాలు లేకుండానే అజ్మేరి కలాకంద్ ను పాలకు బదులుగా మైదాతో తయారు చేస్తున్నారు. మిల్క్ మైసూర్ పాక్ను కూడా పాలు ఉపయోగించకుండా అత్యంత అపరిశుభ్రమైన పరిస్థితుల్లో తయారు చేస్తున్నట్లు గుర్తించారు. బావుపేటలోని శ్రీ బాలాజీ మ్యాజిక్ మిఠాయి తయారీ సంస్థ లో తయారయ్యే స్వీట్లు కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లోని పలు స్వీట్ షాపులు, బేకరీలకు సరఫరా చేస్తున్నారు.
ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల సందర్భంగా సంస్థలో పరిశుభ్రత లోపాలు గుర్తించారు. స్వీట్ల తయారీ ప్రాంగణం అత్యంత అపరిశుభ్రంగా ఉంది. పరిశుభ్రత ప్రమాణాలు పాటించడం లేదు. సుమారు 40 కిలోల కల్తీ స్వీట్లను సంఘటన స్థలం లోనే ధ్వంసం చేశారు. ఈ ఉత్పత్తుల తయారీని నిరోధించేందుకు సుమారు 1,300 కిలోల ముడి పదార్థాలు (మైదా, చక్కెర తదితరాలు)ను స్వాధీనం చేసుకున్నారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ రిజి స్ట్రేషన్ సర్టిఫికెట్ను సస్పెండ్ చేసి ఆ సంస్థను సీజ్ చేశారు.
అనంతరం కరీంనగర్లోని కూచిపూడి రెస్టారెంట్లో నిర్వహించిన తనిఖీల్లో వంటశాల అపరిశుభ్రంగా ఉండడం, ఆహార నిర్వాహకులు వ్యక్తిగత పరిశుభ్రత ప్రమాణాలు పాటించకపోవడం గుర్తించినట్లు గెజిటెడ్ ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ రోహిత్రెడ్డి తెలిపారు. బట్టర్ నాన్ తయారీలో ఫ్యాట్ స్ర్పెడ్ వినియోగిస్తున్నట్లు గుర్తించారు. సంబంధిత వ్యాపారికి ఇంప్రూ వ్మెంట్ నోటీస్ జారీ చేశామన్నారు. గీతాభవన్ చౌరస్తాలోని ఫేమస్ హోటల్ ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.
దీంతో హోటల్ను వెంటనే మూసివేయించినట్లు, అవసరమైన లైసెన్స్ పొందిన అనంతరం మాత్రమే తిరిగి కార్యకలాపాలకు అనుమతి ఇవ్వ నున్నట్లు తెలిపారు. గీతాభవన్ చౌరస్తా సమీపంలోని మతామ్ అల్ హబీబి అరేబియన్ ఫ్యామిలీ రెస్టారెంట్లో తనిఖీలు నిర్వహించగా పలు ఆహార భద్రతా ఉల్లంఘనలు గుర్తించామ న్నారు. గతంలోనే ఆహార తయారీలో కృత్రిమ రంగులు ఉపయోగించ వద్దని స్పష్టంగా సూచించినా నిబంధనలను పాటించలేదని తెలిపారు.
వంటశాలలో బొద్దింకలు సంచరిస్తున్నట్లు గుర్తించామని, సుమారు ఎనిమిది కిలోల హాండీ రైస్ సంఘటనా స్థలంలోనే ధ్వంసం చేశామని అన్నారు. తీవ్రమైన ఉల్లంఘనలను పరిగణనలోకి తీసుకొని, ఆ సంస్థ లైసెన్స్ రద్దు చేసినట్లు చెప్పారు. అదేవిధంగా, సంబంధిత ఆహార పదార్థాల నమూనాలను సేకరించామని, విశ్లేషణ నిమిత్తం రాష్ట్ర ఆహార ప్రయోగశాలకు పంపించామని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
వరంగల్ మార్కెట్లో మక్కలకు రికార్డు ధర
మెట్రో టేకోవర్ కోసం రుణాల వేట
Read Latest AP News And Telangana News And International News And Telugu News