నాడు సంపన్నుల దర్పం సైకిల్
ABN , Publish Date - Jun 03 , 2026 | 07:37 AM
ఇప్పుడంటే ఆర్థిక స్థాయి, స్తోమత ప్రదర్శనకు ఖరీదైన కార్ల సేకరణ ఒక ప్రతీక. సైకిల్ పేదవాడి వాహనంగా మారింది.
నగరంలో సైకిల్కు 150 ఏళ్ల చరిత్ర
నేడు ప్రపంచ సైకిల్ దినోత్సవం
హైదరాబాద్ సిటీ: ఇప్పుడంటే ఆర్థిక స్థాయి, స్తోమత ప్రదర్శనకు ఖరీదైన కార్ల సేకరణ ఒక ప్రతీక. సైకిల్ పేదవాడి వాహనంగా మారింది. వందేళ్ల కిందట మాత్రం అత్యంత సంపన్నులు సైతం మోటారు వాహనాలతోపాటు తప్పనిసరిగా సైకిల్ కొనుగోలు చేసేవారట. అంతెందుకు! ప్రపంచంలోనే అత్యంత సంపన్నవంతుడిగా ఖ్యాతిపొందిన ఆస్ఫజాహీలు సైతం సైకిల్ను దర్పంగా ప్రదర్శించిన సందర్భాలున్నాయని చరిత్ర చెబుతుంది. నగరానికి 1860లో ఆంగ్లేయుల ద్వారా సైకిల్ పరిచయమైంది. అదే సమయంలో ఇర్రంమంజిల్ నిర్మాత నవాబ్ ఫక్రూల్ ముల్క్ బహదూర్ మొట్టమొదటిసారిగా సైకిల్ కొనుగోలు చేసినట్లు చరిత్రలో నమోదైంది.
ఆరో నిజాం నవాబు బామ్మర్ది పైగా రాజవంశానికి చెందిన అమీర్ నవాబ్ జాఫర్ జంగ్ బహదూర్ 1896లో బషీర్బాగ్ ప్యాలెస్లో సైకిల్ క్లబ్ను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ జేమ్స్స్ట్రీట్లో 1904లో మొట్టమొదటి సైకిల్ షోరూమ్ ‘బొంబాయి సైకిల్ ఏజెన్సీ’ పేరుతో ప్రారంభమైంది. తర్వాత నగర పోలీసులు ఫ్రెంచ్మేడ్ క్లెమెల్ట్ సైకిల్ను వినియోగించేవారు. నగరంలో 1960వరకు సైకిల్ వాహనదారులు తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలనే నిబంధన కొనసాగింది.
సైకిల్ ముందు హెడ్లైట్ పనిచేయకపోయినా నిజాం సర్కారు జరిమానా విధించేది. ప్రస్తుతం హైదరాబాద్లో పదుల సంఖ్యలో సైకిల్ అసోసియేషన్లున్నాయి. పేదలతో పాటు పర్యావరణ హితకారులు కొద్దిమంది సైకిల్మీద వెళుతుండడం చూస్తున్నాం. ఏదేమైనా నగర చరిత్రలో సైకిల్కూ 150ఏళ్ల కథ ఉండడం ప్రత్యేకం. అదీ ఆనాటి నవాబుల అభిమాన వాహనం కావడం విశేషం.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News