చిట్టీ కాదు చీటింగ్... రూ.20 కోట్లతో పరారైన మహిళ
ABN , Publish Date - Sep 11 , 2026 | 04:30 PM
ఓ మహిళ చిట్టీల పేరుతో కొందరిని నిలువునా మోసం చేసింది. వారి నుంచి సుమారు 20 కోట్ల రూపాయలు తీసుకుని పరారైంది.
హైదరాబాద్, సెప్టెంబరు 11: నగరంలోని కేపీహెచ్బీ పరిధిలో ఓ మహిళ చిట్టీల పేరుతో భారీ మోసానికి పాల్పడింది. సుమారు 45 మంది వద్ద నుంచి రూ.20 కోట్లు వసూలు చేసి పరారైంది. దీంతో మోసపోయామని గుర్తించిన బాధితులు.. లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంషిగూడ సాయిచరణ్ కాలనీలో నివసించే సీతమ్మ అనే మహిళ చిట్టీల వ్యాపారం నిర్వహించేది. ఈ నేపథ్యంలో కొందరు స్థానికుల వద్ద నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసింది. అయితే చిట్టీ గడువు ముగిసినా ఆమె ఎవరికీ డబ్బులు చెల్లించలేదు. ఎందుకు డబ్బులివ్వడం లేదని ప్రశ్నిస్తే.. ఇదిగో ఇస్తా, అదిగో ఇస్తా అని వాయిదాలు వేస్తూ వచ్చింది. చివరకు ఆ డబ్బుతో ఇంటి నుంచి పరారైంది.
విషయం తెలుసుకున్న బాధితుల్లో ముగ్గురు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం 45 మంది నుంచి ఆమె 20 కోట్ల రూపాయల వరకు వసూలు చేసిందని ఆరోపించారు. తమ ముగ్గురి నుంచే దాదాపు కోటి రూపాయలు తీసుకుందని వాపోయారు. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయని మీడియాకు వెల్లడించారు.
ఈ వార్తలూ చదవండి
వీల్చైర్లో ఉన్న వ్యక్తి నగదు దోపిడి.. వీడియో వైరల్.
వీడిన హైదరాబాద్ ఆయుధాల చోరీ మిస్టరీ.. మాజీ మిలిటరీ అధికారి అరెస్ట్..