ఒక్క రోజులో 20 లక్షలకు పైగా టిక్కెట్లు.. రైల్వే చరిత్రలో రికార్డు బుకింగ్స్
ABN , Publish Date - Sep 11 , 2026 | 04:18 PM
వినాయక చవితి సందర్భంగా రైలు ప్రయాణాలకు డిమాండ్ భారీగా పెరిగింది. ఒక్క రోజులోనే 20 లక్షలకు పైగా టిక్కెట్లు బుక్ అయ్యాయి. ఐఆర్సీటీసీ చరిత్రలో ఒకే రోజులో ఇంత భారీ స్థాయిలో టిక్కెట్లు బుక్ కావడం ఇదే తొలిసారి.
ఇంటర్నెట్ డెస్క్: వినాయక చవితి పండుగ దగ్గర పడుతుండటంతో రైలు ప్రయాణాలకు డిమాండ్ భారీగా పెరిగింది. ఈ క్రమంలో రైల్వే టికెట్ బుకింగ్లో కొత్త రికార్డు నమోదైంది. సెప్టెంబర్ 7న ఒక్క రోజులోనే 20 లక్షలకు పైగా టికెట్లు బుక్ అయ్యాయి. ఇది ఐఆర్సీటీసీ చరిత్రలోనే అత్యధిక సింగిల్ డే బుకింగ్స్గా నిలిచింది.
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రకారం.. సెప్టెంబర్ 7న మొత్తం 20,06,353 టికెట్లు బుక్ అయ్యాయి. ఒక్క రోజులో 20 లక్షల టికెట్ల మార్క్ దాటడం ఇదే తొలిసారి. సెప్టెంబర్ 8న కూడా బుకింగ్స్ భారీగానే కొనసాగాయి. ఆ రోజు 19,50,699 టికెట్లు బుక్ అయ్యాయి. గత ఏడాది పండుగ సీజన్లో ఒక్క రోజులో అత్యధికంగా 18,40,203 టికెట్లు బుక్ కాగా.. ఈసారి దానితో పోలిస్తే సుమారు 6 శాతం ఎక్కువగా నమోదయ్యాయి.
ప్రస్తుతం రిజర్వేషన్ టికెట్లలో దాదాపు 89 శాతం ఆన్లైన్లోనే బుక్ అవుతున్నాయని ఐఆర్సీటీసీ తెలిపింది. పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని కొత్త సర్వర్లను ఏర్పాటు చేయడంతో ఆన్లైన్ టికెట్ బుకింగ్ సామర్థ్యం దాదాపు రెట్టింపు అయిందని ఐఆర్సీటీసీ తెలిపింది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
గ్యాస్, గుండెపోటు మధ్య తేడా ఏంటి? ఈ విషయాలు తెలుసుకోండి
నిద్రలో చెమటలు పడుతున్నాయా? కారణం ఇదే కావచ్చు!