దానం నాగేందర్ కేసు విచారణ.. పాడి కౌశిక్రెడ్డి ఏమన్నారంటే?
ABN , Publish Date - Jan 30 , 2026 | 10:50 AM
అనర్హత పిటిషన్లపై ఎమ్మెల్యే దానం నాగేందర్ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నేడు విచారించనున్నారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. దానం నాగేందర్పై స్పీకర్ అనర్హత వేటు వేస్తారని నమ్ముతున్నామన్నారు.
హైదరాబాద్, జనవరి 30: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై(MLA Danam Nagender) దాఖలైన అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(TG Assembly Speaker Gaddam Prasad Kumar) శుక్రవారం విచారణ చేపట్టనున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(MLA Padi Kaushik Reddy) మీడియాతో మాట్లాడుతూ.. ‘మేం ఇచ్చిన నోటీసులపై విచారణ కోసం స్పీకర్ దానం నాగేందర్ను పిలిపించారు. ఆయనపై సభాపతి అనర్హత వేటు వేస్తారని నమ్ముతున్నాం’ అని అన్నారు. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశారని.. దానం పోటీ చేసిన దానికంటే పెద్ద ప్రూఫ్ ఏముంటుంది? అని ఈ సందర్భంగా ప్రశ్నించారు కౌశిక్ రెడ్డి.
కాగా.. గత అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్ఎస్ తరఫున ఖైరతాబాద్ నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ నుంచి ఎంపీగా బరిలోకి దిగారు. దీంతో ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. దానంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డిలు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై మరికాసేట్లో దానం నాగేందర్ను స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించనున్నారు.
పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై ఈరోజు ఉదయం 10:30 గంటలకు విచారణ జరుగనుండగా, బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి వేసిన దావా.. మధ్యాహ్నం 12:00 గంటలకు విచారణకు రానుంది. దానం తరఫు అడ్వకేట్లు.. పాడి కౌశిక్, ఏలేటి మహేశ్వర్ రెడ్డిలను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. అయితే ఇప్పటికే దానం నాగేందర్ తన న్యాయవాదుల ద్వారా స్పీకర్కు కౌంటర్ దాఖలు చేశారు. తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని, పార్టీకి రాజీనామా చేయలేదని, బీఆర్ఎస్ తనను సస్పెండ్ చేయలేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో దానం నాగేందర్ విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఇవి కూడా చదవండి...
రేవంత్ నయా రికార్డ్.. హార్వర్డ్ నుంచి సర్టిఫికెట్ పొందిన తొలి సీఎం
నిరుద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త.. ఉగాది నాటికి..
Read Latest Telangana News And Telugu News