మాజీ ఓఎస్డీ సుమంత్ పిటిషన్పై వాదనలు.. విచారణ రేపటికి వాయిదా
ABN , Publish Date - Aug 31 , 2026 | 05:23 PM
తెలంగాణ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ పిటిషన్పై రాష్ట్ర హై కోర్టులో సోమవారం విచారణ జరిగింది.
హైదరాబాద్, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ పిటిషన్పై రాష్ట్ర హై కోర్టులో (Telangana High Court) ఈరోజు (సోమవారం) విచారణ జరిగింది. సుమంత్ తరుపున సీనియర్ న్యాయవాది వంశీధర్ రెడ్డి న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. ఈ కేసు పూర్తిగా రాజకీయ కుట్రలో భాగంగా పెట్టినదని చెప్పుకొచ్చారు. సుమంత్పై ఫిర్యాదు చేసిన హరికృష్ణ అనే వ్యక్తిపైనే 5 ఫిర్యాదులు ఉన్నాయని ప్రస్తావించారు.
హరికృష్ణకు పలువురి పేర్లు చెప్పి డబ్బులు వసూలు చేయడం అలవాటని సుమంత్ తరఫు న్యాయవాది వంశీధర్ రెడ్డి ఆరోపించారు. అందుకే హరికృష్ణపై ఈ కేసుతో సంబంధం లేని వారు వివిధ చోట్ల 5 ఫిర్యాదులు చేశారని తెలిపారు. ఈ కేసులో హత్యాయత్నం బీఎన్ఎస్ నంబర్- 109 సెక్షన్ ఎలా వర్తిస్తుంది.? అని అడిగారు. రాష్ట్రంలో ఇప్పుడు మంత్రి కొండా సురేఖ వ్యవహారం నడుస్తోండటంతో కావాలనే సుమంత్పై ఈ కేసును కొంతమంది పెట్టించారని ఆరోపించారు. ఈ ఘటన జరిగిన 22 రోజుల తర్వాత పోలీసులను సుమంత్ ఆశ్రయించాడని సుమంత్ తరఫు న్యాయవాది వంశీధర్ రెడ్డి చెప్పారు.
సుమంత్ పిటీషన్పై విచారణ రేపటికి వాయిదా
అయితే, కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ పిటీషన్పై విచారణను తెలంగాణ హైకోర్టు రేపటికి (మంగళవారానికి) వాయిదా వేసింది. జూబ్లీహిల్స్ పీఎస్లో సుమంత్పై నమోదైన కేసును కొట్టివేయాలంటూ పిటీషన్ దాఖలైన విషయం తెలిసిందే. రాజకీయ కారణాలతో తప్పుడు ఫిర్యాదు చేశారని సుమంత్ తరఫు న్యాయవాది వంశీధర్ రెడ్డి తెలిపారు. ఈ కేసు దర్యాప్తునకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని సుమంత్ న్యాయవాది చెప్పారు. ఫిర్యాదు మేరకే ఈ కేసు నమోదు చేశామని ఏసీపీ జితేందర్ రావు పేర్కొన్నారు.
సుమంత్పై మొదట కేస్ నమోదు చేయలేదు: పప్పు నాగేశ్వర్రావు
ఈ కేసులో బాధితుడు హరికృష్ణ తరపున పప్పు నాగేశ్వర్రావు హైకోర్టులో వాదనలు వినిపించారు. ఈ వ్యవహరంలో సుమంత్పై మొదట పోలీసులు కేసు నమోదు చేయలేదని అన్నారు. సుమంత్ బ్యాక్ గ్రౌండ్ చూసి జూబ్లీహిల్స్ పోలీసులు మొదట కేసు నమోదు చేయలేదని చెప్పారు. ఈ వ్యవహరంలో ఓ ఇన్స్పెక్టర్ కూడా సస్పెండ్ అయ్యారని ప్రస్తావించారు. బాధితుడి చేతులు, కాళ్లపై రాడ్లతో సుమంత్ దాడి చేశాడని పప్పు నాగేశ్వర్రావు ఆరోపించారు.
బాధితుడి నివాసం మేడిపల్లిలో ఉండటంతో అక్కడ ఫిర్యాదు చేశాడని పప్పు నాగేశ్వర్రావు అన్నారు. అక్కడ జీరో FIR నమోదు చేసి మళ్లీ జూబ్లీహిల్స్కు బదిలీ చేశారని తెలిపారు. చంపేస్తానని బెదిరించడంతో పాటు విచక్షణ రహితంగా దాడి చేశాడని.. ఇది హత్యాయత్నం బీఎన్ఎస్ నంబర్- 109 కిందకే వస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు హైకోర్టుని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొంత సమయం కోరారు.
ఇవి కూడా చదవండి..
‘టాక్సిక్’లో అసభ్యత తప్ప సమాజానికి ఉపయోగపడే సందేశం లేదు: రాజాసింగ్
వికారాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News