గ్రూప్-1 నియామకాలపై సుప్రీంకోర్టు తీర్పు.. సీఎం రేవంత్ స్పందన
ABN , Publish Date - Apr 03 , 2026 | 11:02 AM
తెలంగాణ గ్రూప్ -1 ఉద్యోగ నియామకాల విషయంలో భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇది ఉద్యోగ నియామకాల పట్ల తమ ప్రభుత్వ పారదర్శకతకు, చిత్తశుద్ధికి గుర్తింపుగా భావిస్తున్నామన్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 3: తెలంగాణ గ్రూప్-1 నియామకాలపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణ గ్రూప్ -1 ఉద్యోగ నియామకాల విషయంలో భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఇది ఉద్యోగ నియామకాల పట్ల తమ ప్రభుత్వ పారదర్శకతకు, చిత్తశుద్ధికి గుర్తింపుగా భావిస్తున్నామన్నారు.
కొలువుల కోసం సంవత్సరాల తరబడి కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసి, కన్నవారి కష్టంపై ఆధారపడలేక, కొలువు వస్తుందో రాదో అన్న దిగులుతో పదేళ్లు కాలం వెళ్లదీసిన గ్రూప్ -1 ఆశావహులకు ఇది పెద్ద ఊరటగా చెప్పుకొచ్చారు. ప్రజా ప్రభుత్వం వచ్చీ రావడంతోనే నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. పరీక్షలు నిర్వహించి నెలల వ్యవధిలో నియామక పత్రాలు అందజేసినట్లు తెలిపారు. ఈ నియామకాలను అడ్డుకోవాలనుకున్న దుష్ట శక్తుల కుట్రలను కుతంత్రాలను ఛేదించి, రాష్ట్ర పునర్ నిర్మాణంలో తొలి గ్రూప్ -1 అధికారులుగా యువతను భాగస్వాములను చేశామని వెల్లడించారు. వారికి మరోసారి సీఎం అభినందనలు తెలియజేశారు.
ప్రభుత్వం ఆలోచనలు, సంకల్పానికి అనుగుణంగా టీజీపీఎస్సీ వ్యవస్థను ప్రక్షాళన చేసి, నిరుద్యోగ యువతకు వ్యవస్థ పట్ల విశ్వాసాన్ని పునరుద్ధరించి, అత్యంత పారదర్శకంగా ఈ నియామకాలను పూర్తి చేసిన టీజీపీఎస్సీ ఛైర్మన్, ఉద్యోగులు, సిబ్బందికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి...
ఎన్టీఆర్ జిల్లాలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి
బైక్ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముగ్గురి మృతి
Read Latest Telangana News And Telugu News