Share News

అమ్మా.. ఇంకా బతికున్నానే..!

ABN , Publish Date - Apr 14 , 2026 | 09:54 AM

కన్నపేగుకు ఎంత కష్టమొచ్చిందో..! పెంచాల్సిన తండ్రికి ఎంత బరువైందో..! ఆడబిడ్డగా పుట్టినందుకు కుటుంబానికే ఈసడింపు వచ్చిందో..! తెలియదు కానీ.. పసిగుడ్డు అనే కనికరం కూడా చూపకుండా రైలు పట్టాలపై పడేసి వెళ్లిపోయారు.

అమ్మా.. ఇంకా బతికున్నానే..!

  • రైలు పట్టాలపై పసికూన

  • సిబ్బంది గుర్తించి పోలీసుల సహాయంతో ఆస్పత్రికి తరలింపు

సికింద్రాబాద్‌: కన్నపేగుకు ఎంత కష్టమొచ్చిందో..! పెంచాల్సిన తండ్రికి ఎంత బరువైందో..! ఆడబిడ్డగా పుట్టినందుకు కుటుంబానికే ఈసడింపు వచ్చిందో..! తెలియదు కానీ.. పసిగుడ్డు అనే కనికరం కూడా చూపకుండా రైలు పట్టాలపై పడేసి వెళ్లిపోయారు. రైలు శబ్దాలు, రాళ్లు, దుమ్ము, ధూళి మధ్యలో ఈగలు వాలుతూ.. చీమలు కుడుతుండగా గుక్కపెట్టి ఏడుస్తున్న ఆ చిన్నారిని రైల్వే సిబ్బంది గమనించి, రైల్వే పోలీసుల సహాయంతో ఆస్పత్రిలో చేర్పించారు.


ఈ ఘటన హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో చోటుచేసుకుంది. అప్పుడే జన్మించిన రోజుల ఆడశిశువు లక్డీకాపూల్‌, ఖైరతాబాద్‌ రైల్వేస్టేషన్ల మధ్య పట్టాల పక్కన సోమవారం ఏడుస్తూ పడి ఉంది. సమీపంలో విధులు నిర్వహిస్తున్న ఓ రైల్వే సఫాయివాలా గమనించి వెంటనే నాంపల్లి జీఆర్‌పీ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.


ఎస్సై శ్రీనివాసులు, హెడ్‌ కానిస్టేబుళ్లు సాయికుమార్‌, శ్రీనివాసులు, శేఖర్‌ వెంటనే ఘటన స్థలానికి చేరుకుని, శిశువును వైద్య పరీక్షల నిమిత్తం నిలోఫర్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం శిశువుకు ఆస్పత్రి వైద్యులు ఎన్‌ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఘటనకు కారణమైన వారిని గుర్తించే పనిలో ఉన్నట్లు జీఆర్‌పీ సీఐ ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. తగ్గిన పసిడి, వెండి ధరలు

రాజధాని అమరావతి జోలికొస్తే ఖబడ్దార్‌

Read Latest Telangana News and National News

Updated Date - Apr 14 , 2026 | 09:54 AM