Share News

కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు.. సర్కార్‌‌పై కేటీఆర్ ప్రశ్నల వర్షం

ABN , Publish Date - Mar 18 , 2026 | 11:10 AM

మూసీ ప్రాజెక్ట్‌కు సంబంధించి అసెంబ్లీలో ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు కేటీఆర్. పాకిస్థాన్‌లో బ్యాన్ చేసిన కంపెనీకి మూసీ డీపీఆర్‌ తయారీ బాధ్యత అప్పగించారని.. ఆ కంపెనీపై ప్రభుత్వానికి ఎందుకంత ప్రేమ అని మాజీ మంత్రి ప్రశ్నించారు.

కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు.. సర్కార్‌‌పై కేటీఆర్ ప్రశ్నల వర్షం
Telangana Assembly

హైదరాబాద్, మార్చి 18: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly) ప్రారంభమయ్యాయి. శాసనసభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మూసీ ప్రాజెక్ట్‌కు సంబంధించి ప్రభుత్వానికి మాజీ మంత్రి కేటీఆర్‌ పలు ప్రశ్నలు సంధించారు. ‘ప్రభుత్వాన్ని నేను కొన్ని ప్రశ్నలు సూటిగా అడుగుతున్నా. పాకిస్థాన్‌లో బ్యాన్ చేసిన మెయిన్ హార్ట్ అనే కంపెనీకి మూసీ డీపీఆర్‌ తయారీ బాధ్యత ఇచ్చారు. డీపీఆర్ తయారీకి 18 నెలలు పడుతుందని చెప్పారు. కానీ రెండు నెలల్లో ఎలా డీపీఆర్ తయారైంది? ఆ చమత్కారం ఏంటో చెప్పాలి’ అని అడిగారు.


డీపీఆర్‌ సబ్మిట్ చేయలేదని.. మూసీకి ఏడీబీ అప్పు ఇవ్వలేదని ప్రభుత్వం చెప్పిందన్నారు. రూ.16 వేల కోట్లతో అయిపోయే ప్రాజెక్ట్‌ను లక్షన్నరకు ఎందుకు పెంచారని ప్రశ్నించారు. లక్షన్నర కోట్లను ఎక్కడ ఖర్చు పెట్టబోతున్నారో చెప్పాలన్నారు. మెయిన్ హార్ట్ కంపెనీని పాకిస్థాన్ బ్యాన్ చేసిందని.. ఆ కంపెనీ మీద ఈ ప్రభుత్వానికి ఎందుకో అంత ప్రేమ అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు.


మూసీపై చర్చకు సిద్ధం: మంత్రి శ్రీధర్ బాబు

దీనిపై మంత్రి శ్రీధర్ బాబు సమాధానమిస్తూ.. మూసీ ప్రాజెక్ట్‌పై ఇంకా డీటెయిల్‌గా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అవసరమైతే దీనిపై లఘు చర్చ పెడదామన్నారు. ఇది ప్రశ్నోత్తరాల సమయమని.. తొమ్మిది నిమిషాలకు మించి ఒక ప్రశ్నపై చర్చించకూడదని బీఏసీలో నిర్ణయం తీసుకున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.


మా హయాంలోనే మూసీ ప్రక్షాళన మొదలు: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

మూసీ ప్రాజెక్ట్‌కు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళన ప్రారంభమైందే బీఆర్ఎస్ హయాంలో అని తెలిపారు. మూడు దశల్లో మూసీ ప్రక్షాళన జరుగుతుందని.. ఆనాడే 31 ఎస్టీపీలతో నీటిశుద్ధి కార్యక్రమాన్ని చేపట్టామని వెల్లడించారు. 11వేల నిర్మాణాలను ఆనాడే తాము గుర్తించినట్లు చెప్పుకొచ్చారు. కానీ ఒక్క ఇంటిని కూడా కూల్చలేదన్నారు. ఈ ప్రభుత్వం పేదలపై కక్షకట్టినట్టు వ్యవహరిస్తోందని మండిపడ్డారు.


రెడ్ మార్క్‌లు పెట్టి ఇళ్లను కూలగొడుతోందని ఎమ్మెల్యే విమర్శలు గుప్పించారు. శుభ్రమైన నీటిని మూసీలోకి వదలాలని.. కాలుష్య కారకాలను తొలగించాలని డిమాండ్ చేశారు. నిరంతరం మూసీలో పరిశుభ్రమైన నీరు ప్రవహించేలా చేయాలన్నారు. ఈస్ట్‌ వెస్ట్‌ను లింక్‌ చేసేలా ఆనాడు ప్లాన్ చేసినట్లు తెలిపారు. తాము ఆనాడు మొదలుపెట్టిన పనులను ఈ ప్రభుత్వం నత్తనడకన నడిపిస్తోందని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు.


మూసీ అభివృద్ధి జరగాలి: ఎమ్మెల్యే దానం నాగేందర్

హైదరాబాద్ అభివృద్ధి కోసం మూసీ పునరుద్ధరణకు కేటీఆర్ రూపకల్పన చేశారని.. కానీ ఈనాడు దాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారో అర్థం కావడం లేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. మూసీ మురికి కాలువగా మారిందని తెలిపారు. మూసీ అభివృద్ధి జరగాలని అన్నారు. గతంలో ప్లాన్ లేకుండా ట్రాక్ వేశారని.. అది ఇప్పుడు లేకుండా పోయిందని ఎమ్మెల్యే దానం నాగేందర్ సభలో తెలిపారు.


ఇవి కూడా చదవండి...

మాజీ మంత్రి కఠారి ఈశ్వర్ ఇంట్లో చోరీ... పోలీసుల దర్యాప్తు

గన్‌పార్క్ వద్ద బీఆర్‌ఎస్ నేతల నిరసన

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 18 , 2026 | 11:18 AM