Share News

Borabanda incident: బోరబండలో ఉన్మాది ఘాతుకం.. మాట్లాడటం లేదన్న అనుమానంతో...

ABN , Publish Date - Jan 12 , 2026 | 08:31 AM

హైదరాబాద్ నగరంలోని బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఉన్మాది ఘాతుకానికి ఒడిగట్టాడు. కేవలం తనతో సరిగ్గా మాట్లాడటం లేదనే చిన్న కారణంతో ఓ యువతి ప్రాణాలను బలితీసుకున్నాడు. పబ్‌లో మొదలైన పరిచయం.. చివరకు హత్యకు దారితీసింది. వివరాల్లోకెళితే...

Borabanda incident: బోరబండలో ఉన్మాది ఘాతుకం.. మాట్లాడటం లేదన్న అనుమానంతో...
Borabanda incident

హైదరాబాద్, జనవరి12 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నగరంలో మరో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. బోరబండ ప్రాంతంలో ఓ యువకుడు తనతో సరిగ్గా మాట్లాడటం లేదనే కారణంతో ఓ యువతిని దారుణంగా హత్య చేశాడు(Borabanda incident). ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దీంతో నగరంలో మహిళల భద్రతపై మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.


పబ్‌లో పరిచయం.. మొదలైన స్నేహం..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడైన యువకుడికి, యువతితో బంజారాహిల్స్‌లోని ఓ పబ్‌లో గతంలో పరిచయం ఏర్పడింది. ఆ పబ్‌లో యువతి ఉద్యోగం చేస్తుండగా, తరచూ అక్కడికి వచ్చే యువకుడితో పరిచయం ఏర్పడి క్రమంగా స్నేహంగా మారింది. మొదట సాధారణంగా మాట్లాడుకున్నా.. కాలక్రమేణా ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడినట్లు తెలుస్తోంది.

ఊర్వశీ బార్‌కు షిఫ్ట్ అయిన యువతి..

అయితే.. కొద్ది రోజుల క్రితం ఆ యువతి బంజారాహిల్స్‌లోని పబ్‌ను విడిచి, బోరబండ పరిధిలోని ఊర్వశీ బార్‌కు ఉద్యోగం మారింది. ఆ తర్వాత.. యువతి నిందితుడితో మాట్లాడటం తగ్గించిందని, ఫోన్ కాల్స్‌కు కూడా సరిగా స్పందించకపోవడంతోనే ఈ హత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

అనుమానం..

యువతి తనను పట్టించుకోవడం లేదని, ఉద్దేశపూర్వకంగా దూరం పెడుతోందనే అనుమానం నిందితుడిలో పెరిగింది. ఈ అనుమానం క్రమంగా కోపంగా, ఆగ్రహంగా మారి చివరికి హత్యకు దారితీసింది. తనతో మాట్లాడకపోవడానికి కారణం ఏంటో తెలుసుకోవాలనే నెపంతోనే నిందితుడు యువతిని పిలిచినట్టు సమాచారం.


మాట్లాడదామని పిలిచి..

యువతిని బోరబండ ప్రాంతానికి నిన్న(ఆదివారం) నిందితుడు పిలిచాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో.. తీవ్ర కోపంతో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. పదునైన ఆయుధంతో యువతిని హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలంలోనే యువతి మృతిచెందినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.

మహిళల భద్రతపై ఆందోళన...

ఈ ఘటన బోరబండ పరిసర ప్రాంతాల్లో తీవ్ర కలకలం రేపింది. జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. ముఖ్యంగా రాత్రి వేళ ఉద్యోగాలు చేసే యువతుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.


పోలీసుల అదుపులో నిందితుడు..

సమాచారం అందుకున్న వెంటనే బోరబండ పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. హత్యకు పాల్పడిన యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి, పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

పెరుగుతున్న ఘటనలు..

ఇటీవల హైదరాబాద్‌లో మహిళలపై దాడులు, వేధింపులు, హత్యలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. చిన్న పరిచయాలు, సోషల్ మీడియా, ఉద్యోగ స్థలాల్లో ఏర్పడే సంబంధాలు ఎలా ప్రాణాంతకంగా మారుతున్నాయో ఈ ఘటన మరోసారి స్పష్టం చేస్తోంది.

కఠిన చర్యలు తీసుకుంటాం..

ఈ ఘటనపై పోలీసులు తీవ్రంగా స్పందించారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నిందితుడికి చట్టపరంగా శిక్షపడేలా చేస్తామని బోరబండ పోలీసులు తెలిపారు.

మృతురాలి కుటుంబంలో విషాదం..

యువతి మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఉద్యోగం చేస్తూ కుటుంబానికి అండగా నిలిచిన కుమార్తెను కోల్పోవడం తల్లిదండ్రులను తీవ్రంగా కలిచివేసింది. నిందితుడికి కఠినశిక్ష విధించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మాజీ సీఎం రోశయ్య సతీమణి కన్నుమూత..

టార్గెట్ మున్సిపోల్స్.. బీఆర్ఎస్ ప్రత్యేక కార్యాచరణ..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 12 , 2026 | 10:09 AM