ఇక నిఘా నీడలో ఈవీ స్టేషన్లు
ABN , Publish Date - Jun 06 , 2026 | 10:13 AM
ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఇక నిఘా నీడలోకి వెళ్లనున్నాయి. గ్రేటర్ పరిధిలో టీజీ రెడ్కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చార్జింగ్ స్టేషన్లలో కొన్ని నెలలుగా చార్జింగ్ గనులు, కేబుళ్లను కొందరు దొంగిలిస్తున్నారు.
ప్రతీ స్టేషన్ వద్ద సీసీ కెమెరా
చార్జింగ్ గన్లు, కేబుల్ దొంగతనాల నివారణకు చర్యలు
హైదరాబాద్ సిటీ: ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఇక నిఘా నీడలోకి వెళ్లనున్నాయి. గ్రేటర్ పరిధిలో టీజీ రెడ్కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చార్జింగ్ స్టేషన్లలో కొన్ని నెలలుగా చార్జింగ్ గనులు, కేబుళ్లను కొందరు దొంగిలిస్తున్నారు. ఎల్బీనగర్, నాగోల్, ఉప్పల్, అంబర్పేట్, అబిడ్స్, గాజులరామారం, కూకట్పల్లి, వెస్ట్మారేడ్పల్లి ప్రాంతాల్లోని చార్జింగ్ స్టేషన్లలో కేబుల్స్తో కూడిన చార్జింగ్ గన్లు దొంగతనానికి గురవడంతో సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఈ నేపథ్యంలో టీజీ రెడ్కో గ్రేటర్లోని 160 ఈవీ చార్జింగ్ స్టేషన్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంది. ఇప్పటికే 30కి పైగా ఈవీ చార్జింగ్ స్టేషన్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. మరికొన్ని రోజుల్లో ప్రతీ చార్జింగ్ స్టేషన్ వద్ద సీసీ కెమెరా ఉండేలా చర్యలు చేపట్టింది. చార్జింగ్ స్టేషన్ల వద్ద ట్యాంపరింగ్, దొంగతనానికి పాల్పడే వారిని గుర్తించేందుకు ఈ సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని ఓ అధికారి తెలిపారు.
కొత్తగా 816 ఈవీ చార్జింగ్ స్టేషన్లు
రాష్ట్రంలో ప్రస్తుతం 1,063 ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. పీఎం ఈ డ్రైవ్ కింద మరో 816 ఈవీ చార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. ఎన్పీడీసీఎల్ పరిధిలో 116 స్టేషన్లకు అనుమతులు రాగా, టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో 700 చార్జింగ్ స్టేషన్లకు త్వరలో అనుమతులు రానున్నాయి. గ్రేటర్లో రెడ్కో పరిధిలో ప్రస్తుతం 160 ఫాస్ట్ ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఉండగా మరో 40 ఏర్పాటు దశలో ఉన్నాయి. 27కు పైగా ప్రైవేట్ కంపెనీలు చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటన్నిటి వివరాలు, లోకేషన్స్ ఒకే యాప్లో అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం.
అనిలా వావిల్లా, టీజీ రెడ్కో వైస్ చైర్మన్ అండ్ ఎండీ
ఈ వార్తలు కూడా చదవండి:
బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
వాటర్ బోర్డు పేరుతో సైబర్ మోసాలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News