శివారు గ్రామాలకు ‘బుల్లెట్’ టెన్షన్
ABN , Publish Date - Aug 13 , 2026 | 10:44 AM
హైదరాబాద్ నగర శివారు గ్రామాల్లో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ప్రభావం భూముల క్రయ విక్రయాలపై పడింది.
శంషాబాద్ టు కోకాపేట వరకు పిల్లర్ల మార్కింగ్
ఎవరి భూములు పోతాయోనన్న ఆందోళన
భూముల క్రయ విక్రయాలపై ప్రభావం
ఇప్పటికే పూర్తి అయిన పిల్లర్ల మార్కింగ్
నార్సింగ్(హైదరాబాద్): హైదరాబాద్ నగర శివారు గ్రామాల్లో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ప్రభావం భూముల క్రయ విక్రయాలపై పడింది. ఆయా ప్రాంతాల్లో మార్కింగ్ వేయడంతో భూములు కొనాలా వద్దా అనేది సంశయంగా మారింది. హైదరాబాద్ నగరానికి బుల్లెట్ ట్రైన్ ఒక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు. ఈట్రైన్ ప్రధాన హబ్ శంషాబాద్. శంషాబాద్ టు ముంబై రూటులో జంట జలాశయాలు ఉండడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జలాశయాలకు ఇబ్బంది లేకుండా అధికారులు రూటు ప్రిపేర్ చేస్తున్నారు. జలాశయాలపై భాగమైన గ్రామాల గుండా వెళ్లేలా రూటు మ్యాప్ తయారుచేశారు. గండిపేట హిమాయత్సాగర్ ఎఫ్టీఎల్, బఫర్జోన్ దాటిన తర్వాత స్కెచ్ వేశారు. బుల్లెట్ ట్రైన్ భూమిపై కాకుండా పిల్లర్లు వేసి వంతెన పై నుంచి వెళ్లనుంది.
పిల్లర్ల కోసం మార్కింగ్
బుల్లెట్ ట్రైన్ పిల్లర్ల కోసం గండిపేట హిమాయత్సాగర్ పై భాగంలో మార్కింగ్ చేశారు. శంషాబాద్ నుంచి నర్కూడ, కనకమామిడి, అప్పారెడ్డిగూడెం, మెడిపల్లి, చిన్నమంగళవారం, గోపులారం, జన్వాడ, మీర్జాగూడ, వట్టినాగులపల్లి, కోకాపేట గ్రామాల మీదుగా కోకాపేటకు పిల్లర్లకు మార్కింగ్ వేశారు. ఇక కోకాపేట నుంచి ఔటర్ మీదుగా స్టేషన్ నాగులపల్లి గ్రామంలో వికారాబాద్ రైల్వే లైన్కు ఇది కనెక్ట్ కానుంది. కోకాపేట నియో పోలీసు ప్రాంతంలో సైబరాబాద్ స్టేషన్ ఏర్పాటు కానుంది. ఇందుకోసమే ఈ బుల్లెట్ ట్రైన్ రూట్ ఇలా రూపొందించారు. ఇందులో నర్కూడ సుల్తాన్పల్లి ప్రాంతాలు శంషాబాద్ మండలంలో, కనకమామిడి మేడిపల్లి మొయినాబాద్ మండలంలో, గోపులారం, జన్వాడ, మిర్జాగూడ గ్రామాలు శంకర్పల్లి మండలంలో వట్టినాగులపల్లి, కోకాపేట గండిపేట మండలంలో, కొల్లూరు స్టేషన్ నాగులపల్లి సంగారెడ్డి జిల్లా రాంచంద్రాపురం మండలంలోకి వస్తాయి.
రైతులపై బుల్లెట్
శంషాబాద్, శంకర్పల్లి, గండిపేట మండలంలోని గ్రామాల గుండా వస్తున్న ఈ బుల్లెట్ రూట్లో కోకాపేట గ్రామం మినహాయిస్తే మిగతావన్నీ జీవో 111 పరిధిలో ఉన్నాయి. ఆ గ్రామాలపై ఈ ప్రాజెక్టు ప్రభావం పడనుంది. బుల్లెట్ ట్రైన్ మార్గంలో రెండు పక్కల సర్వీ్స రోడ్లు నిర్మించనున్నారు. రోడ్ల నిర్మాణం కోసం భూసేకరణ చేపట్టాల్సి ఉంది. ఈ క్రమంలో ఎవరి భూములు ఎంత పోతాయి? అనే ఆందోళన ఉంది. అలాగే వేగంగా దూసుకెళ్లే బుల్లెట్ ట్రైన్ శబ్దానికి పంటలు పండుతాయా? అన్నది రైతులను కలవర పెడుతోంది. గ్రామాలలో వేసిన పిల్లర్ల నిర్మాణం తాలూకు మార్కింగ్లు భయపెడుతున్నాయి. భూముల క్రయ విక్రయాలపై ప్రభావం చూపిస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
తెలంగాణలో కొత్తగా 460 పోలింగ్ కేంద్రాలు
ప్రియాంక కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థికసాయం
Read Latest AP News And Telangana News And International News And Telugu News