కుక్కలు లాక్కెళ్లి.. పొదల్లో పడేశాయ్
ABN , Publish Date - Mar 05 , 2026 | 07:50 AM
ఆ రెండున్నరేళ్ల చిన్నారి మృత్యుంజయుడే! వీధి కుక్కలు లాక్కెళ్లి.. ముళ్ల పొదల్లో పడేశాయి! ఆ పొదల మధ్యే గాయాలతో 12 గంటలపాటు కొట్టుమిట్టాడాడు.
రెండేళ్ల బాలుడు 12గంటల పాటు అక్కడే
గాయాలతో అపస్మారక స్థితికి..
హైదరాబాద్: ఆ రెండున్నరేళ్ల చిన్నారి మృత్యుంజయుడే! వీధి కుక్కలు లాక్కెళ్లి.. ముళ్ల పొదల్లో పడేశాయి! ఆ పొదల మధ్యే గాయాలతో 12 గంటలపాటు కొట్టుమిట్టాడాడు. తల్లిదండ్రులు, పోలీసులు చుట్టుపక్కల చెట్టూ పుట్టా వెతికి అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని కనుగొన్నారు. గండిపేట(Gandipet)లోని శ్రీగండిమైసమ్మ దేవాలయం వద్ద ఈ ఘటన జరిగింది. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ జేపీ కాలనీకి చెందిన వడ్డె వెంకటేశ్ (30) దినసరి కూలీ.
కుటుంబసభ్యులతో కలిసి మొక్కు తీర్చుకునేందుకు మంగళవారం గండిపేటలోని గండిమైసమ్మ ఆలయానికి వచ్చాడు. దర్శనం, మొక్కులు, భోజనాలు. అయ్యాక సాయంత్రం 5:50 సమయంలో వెంకటేశ్ కుమారుడు అభిమన్యు (2) కనిపించకుండా పోయాడు. చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికినా చిన్నారి ఆచూకీ దొరక్కపోవడంతో తల్లిదండ్రులు నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలతో రాత్రి 9గంటల నుంచి చుట్టు పక్కల ప్రాంతాల్లో జల్లెడ పట్టారు.
తెల్లవారుజామున ఐదింటికి ఓ పొదల మధ్య అపస్మారక స్థితిలో ఉన్న చిన్నారిని కనుగొన్నారు. వెంటనే గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. వీధి కుక్కలు బాలుడిని లాక్కుపోయినట్లు ఆధారాలు సేకరించారు. బహుశా జనం అలికిడితో బాలుడిని కుక్కలు వదిలేసి ఉంటాయని.. అందుకే స్వల్పగాయాలతో బయటపడ్డాడని పోలీసులు భావిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఏప్రిల్ 24, 25 తేదీల్లో కవిత కీలక సమావేశం!
Read Latest Telangana News and National News