పర్చడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు
ABN , Publish Date - Mar 05 , 2026 | 06:34 AM
వైమానిక దాడులతో ఇరాన్లో విధ్వంసం సృష్టిస్తున్నా.. ఆ దేశం తనకు ఉన్న స్వల్ప వనరులతోనే దీటుగా బదులిస్తుండటంతో అమెరికా, ఇజ్రాయెల్ తమ వ్యూహాలను మార్చినట్లు తెలుస్తోంది. ఒకవైపు...
ఇరాన్లో ప్రభుత్వంపై ప్రజలు తిరగబడేలా అమెరికా వ్యూహం.. కుర్దిష్ గ్రూపులనూ రెచ్చగొట్టే ప్రణాళిక
కుర్దిష్ తిరుగుబాటు నేతలతో స్వయంగా మాట్లాడిన ట్రంప్!
ఇరాన్ అధికార క్షేత్రాలను బలహీన
వాషింగ్టన్, మార్చి4: వైమానిక దాడులతో ఇరాన్లో విధ్వంసం సృష్టిస్తున్నా.. ఆ దేశం తనకు ఉన్న స్వల్ప వనరులతోనే దీటుగా బదులిస్తుండటంతో అమెరికా, ఇజ్రాయెల్ తమ వ్యూహాలను మార్చినట్లు తెలుస్తోంది. ఒకవైపు వైమానిక దాడుల ద్వారా ఇరాన్ అధికార క్షేత్రాలను బలహీనపరుస్తూ.. మరోవైపు ఆ దేశ పౌరులే స్వయంగా ప్రభుత్వంపై తిరుగుబాటు చేసేలా రెచ్చగొట్టే ప్రణాళికలు వేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ ప్రభుత్వానికి విరోధులుగా ఉన్న రాజకీయ గ్రూపులతోపాటు ఆ దేశం బయట ఉన్న ఇరాన్ వ్యతిరేక సాయుధ గ్రూపులను ఉసిగొల్పే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇరాన్కు శత్రువులైన కుర్దు తిరుగుబాటుదారులతో అమెరికా ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆ దేశ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరోవైపు ఇరాన్లో అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ ప్రజలను తిరుగుబాటుకు రెచ్చగొట్టే చర్యలను కూడా తీవ్రతరం చేసిందని సమాచారం. ప్రభుత్వంపై తిరగబడాలని ఇరాన్ ప్రజలకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే పిలుపునిచ్చారు. అయితే, యుద్ధం మొదలైనప్పటి నుంచి దేశంలో ప్రభుత్వ వ్యతిరేక నిరసన ప్రదర్శనలు తగ్గుముఖం పట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రజలను మళ్లీ రెచ్చగొట్టి, ప్రభుత్వాన్ని కూలదోసేలా అమెరికా, ఇజ్రాయెల్లు వ్యూహాలకు పదును పెట్టాయి.
కుర్దు నేతలతో ట్రంప్ చర్చలు
ప్రపంచంలో సొంత దేశమంటూ లేని అతిపెద్ద జాతుల్లో కుర్దులు ఒకరు. టర్కీ, ఇరాక్, ఇరాన్, సిరియా, ఆర్మేనియాల్లో కుర్దులు దాదాపు మూడు కోట్ల మంది ఉన్నారు. వీరిలో సున్నీ ముస్లింలు అధికం. మతపరంగా వైరుధ్యాలు ఉన్నప్పటికీ.. కుర్దిస్థాన్ స్వతంత్ర దేశం కోసం అందరూ పోరాడుతున్నారు. ఇరాన్, ఇరాక్ సరిహద్దుల్లో సాయుధ కుర్దు గ్రూపుల కార్యకలాపాలు ఎక్కువగా ఉన్నాయి. గత నెల 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టినప్పటి నుంచి వీరితో అమెరికా అధికారులు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. గత ఆదివారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా కుర్దు నేతలతో మాట్లాడినట్లు ఆ దేశ అధికార వర్గాలు తెలిపాయి. కుర్దు తిరుగుబాటుదారులకు ఆయుఽధాల పరంగా సహాయం అందించి, ఇరాన్ ఉత్తర ప్రాంతంలోని కొంత భూభాగాన్ని ఆక్రమించుకొనేలా చేయాలనేది అమెరికా, ఇజ్రాయెల్ వ్యూహంగా చెబుతున్నారు. అదే జరిగితే ఇరాన్ సైన్యం, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ)లు బలహీనపడిట్లే. అప్పుడు ఇరాన్లోని ఇస్లామిక్ ప్రభుత్వ వ్యతిరేక రాజకీయ శక్తులు ధైర్యంగా పౌర తిరుగుబాటుకు పూనుకొనే అవకాశం ఉంటుంది. కుర్దులు ఆక్రమించుకునే భూభాగాన్ని అమెరికా, ఇజ్రాయెల్ సైన్యాలు వాడుకొని ఇరాన్ సైన్యంపై మరింత ఒత్తిడి పెంచటానికి వీలవుతుంది అని అమెరికా రక్షణ శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు.
భూతల దాడులతో పనిలేకుండా
గత ఏడాది జూన్లో ఇరాన్తో జరిగిన 11 రోజుల ఘర్షణతోపాటు ప్రస్తుత యుద్ధంలో కూడా ఇరాన్ సైనిక, ప్రభుత్వ బలాలను దెబ్బతీయటమే లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. గత ఏడాది జూన్ 13న టెహ్రాన్లోని ఐఆర్జీసీ ప్రధాన కార్యాలయంపై క్షిపణి దాడులు చేసి ఆ సంస్థ కమాండర్ ఇన్ చీఫ్ హొస్సైన్ సలామీతోపాటు చీఫ్ ఆఫ్ స్టాఫ్ బఘేరీని చంపేసింది. మరుసటి రోజు ఇరాన్ రక్షణ శాఖ, రక్షణ పరిశోధన సంస్థ కార్యాలయాలను ధ్వంసం చేసింది. జూన్ 15న ఐఆర్జీసీ నిఘా సంస్థను లక్ష్యంగా చేసుకొని, ఆ సంస్థ అధిపతి మొహమ్మద్ కజేమీని హత్య చేసింది. జూన్ 18న ఇరాన్ అంతర్గత భద్రతా సంస్థ ప్రధాన కార్యాలయాన్ని పేల్చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఖమేనీని చంపివేసిన విషయం తెలిసిందే. ఇలా ఇరాన్ సైనిక, అంతర్గత రక్షణ, ప్రభుత్వ వర్గాలను కకావికలం చేస్తూ పౌర తిరుగుబాటుకు ఇజ్రాయెల్ బాటలు వేస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. భూతల దాడులతో పని లేకుండానే ఇరాన్లో ప్రభుత్వాన్ని మార్చే వ్యూహంతో వెళుతున్నట్లు చెబుతున్నారు.
అమెరికా, ఇజ్రాయెల్లకు మద్దతిస్తే.. మరణమే
అమెరికా, ఇజ్రాయెల్లకు అనుకూలంగా మాట్లాడినా.. ఆ దేశాలు సాగిస్తున్న యుద్ధానికి మద్దతు తెలిపినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్ న్యాయశాఖ అధిపతి ఘోలమ్ హొస్సైనీ మొహసెనీ ఆ దేశ పౌరులను హెచ్చరించారు. బుధవారం ఆయన ప్రభుత్వ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. శత్రు దేశాలకు మద్దతిచ్చే ఇరాన్ పౌరులను ఎవ రినైనా శత్రువులుగా, దేశద్రోహులుగానే పరిగణిస్తామని స్పష్టంచేశారు. గత నెలలో జరిగిన అల్లర్లలో పాల్గొన్న నిరసనకారులపై నమోదైన కేసుల విచారణకు ప్రస్తుతం ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ఇరాన్లో దేశద్రోహం కేసు నిరూపణ అయితే మరణశిక్ష విధిస్తారు.
ఇవీ చదవండి:
ఇరాన్ యుద్ధం.. పెరగనున్న వంటింటి బడ్జెట్..