గన్పార్క్ వద్ద బీఆర్ఎస్ నిరసన.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
ABN , Publish Date - Mar 20 , 2026 | 11:43 AM
గన్పార్క్ వద్ద బీఆర్ఎస్ నేతలు నిరసన చేపట్టారు. ఆరు గ్యారెంటీలను అమలు చేయాలంటూ బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు.
హైదరాబాద్, మార్చి 20: గన్పార్క్ వద్ద బీఆర్ఎస్ పార్టీ నేతలు నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, పాడి కౌశిక్ రెడ్డి తదితర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ నిరసనలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని, రైతు భరోసా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘కాంగ్రెస్ బాకీ కార్డుల’ ప్లకార్డులను ప్రదర్శించారు. ప్రభుత్వ హామీల అమలుపై పాటల రూపంలో నిరసన తెలిపారు బీఆర్ఎస్ నేతలు.
రైతు భరోసా, రుణమాఫీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు, వరి పంటకు ప్రతి ఎకరాకు 500 రూపాయల బోనస్, ఆటో కార్మికులకు సంవత్సరానికి రూ.12 వేలు, రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు, విద్యా భరోసా కార్డు కింద విద్యార్థులకు రూ.5 లక్షల బాకీపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మూడు నెలల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి మూడో బబ్జెట్లో కూడా ఆరు గ్యారెంటీలపై చట్టబద్ధత కల్పించలేదని విమర్శించారు. మూడవ బడ్జెట్లో కూడా గ్యారెంటీల గురుంచి ఊసే లేదన్నారు. కాంగ్రెస్ నేతలు ఎన్నికల సమయంలో హామీల అమలుపై జేమ్స్ బాండు లాగా బాండ్ పేపర్స్ రాసిచ్చారని గుర్తుచేశారు. హామీల అమలుపై ఇప్పటికే ఈ ప్రభుత్వాన్ని అడుగడుగునా ప్రశ్నిస్తున్నామని.. కాంగ్రెస్ మోసాలని ఎప్పటికప్పుడు ఎండగడుతున్నామని తెలిపారు. వృద్ధులు, దివ్యాంగుల తరఫున పెన్షన్ పెంపు కోసం ప్రశ్నించనున్నట్లు చెప్పారు. అసెంబ్లీ సమావేశాలలో ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తామన్నారు. సంక్రాంతికి ఇవ్వాల్సిన రైతుబంధు.. ఉగాది దాటినా ఇంకా ఇవ్వలేదని మండిపడ్డారు. 2 లక్షల ఉద్యోగాలు అంటూ మోసం చేసిన ఈ ప్రభుత్వాన్ని అడుగుడుగునా ప్రశ్నిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
తెలంగాణ వార్షిక బడ్జెట్కు కేబినెట్ ఆమోదం
హైదరాబాద్ మెట్రో రైలులో సాంకేతిక సమస్య
Read Latest Telangana News And Telugu News