Share News

బీఆర్‌ఎస్‌ హయాంలో చెరువుల చెర

ABN , Publish Date - Aug 30 , 2026 | 05:53 AM

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని చెరువులు పూర్తి నిర్లక్ష్యానికి గురయ్యాయని, చాలా చెరువులు ఆక్రమణల పాలయ్యాయని తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ ఆక్షేపించింది. చెరువుల శిఖం భూముల్లోనే లే-అవుట్లు వేసిన దౌర్భాగ్యకర పరిస్థితి ఏర్పడిందని పేర్కొంది

బీఆర్‌ఎస్‌ హయాంలో  చెరువుల చెర
Brs hayam

  • శిఖం భూముల్లోనే లేఅవుట్లు

  • పరిరక్షణకు చట్టాలు తేవాలి

  • చిన్న నీటి పారుదల వ్యవస్థను

  • ఏర్పాటు చేయాలి

  • డబ్ల్యూయూఏలకు నీటి పన్ను

  • వసూలు చేసే అధికారమివ్వాలి

  • రైతు కమిషన్‌ సిఫార్సులు

  • ముఖ్యమంత్రికి నివేదిక అందజేత

  • కేంద్రం నుంచి నిధులు రాబట్టాలి

  • సీఎం రేవంత్‌కు నివేదిక అందజేత

హైదరాబాద్‌, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని చెరువులు పూర్తి నిర్లక్ష్యానికి గురయ్యాయని, చాలా చెరువులు ఆక్రమణల పాలయ్యాయని తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ ఆక్షేపించింది. చెరువుల శిఖం భూముల్లోనే లే-అవుట్లు వేసిన దౌర్భాగ్యకర పరిస్థితి ఏర్పడిందని పేర్కొంది. చెరువుల పరిరక్షణకు ప్రత్యేకంగా చిన్న నీటి పారుదల చట్టాన్ని రూపొందించాలని సర్కారుకు సిఫార్సు చేసింది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి కమిషన్‌ చైర్మన్‌ ఎం.కోదండరెడ్డి, సభ్యులు రాములునాయక్‌, గోపాల్‌రెడ్డి, గంగాధర్‌, భవానీరెడ్డి బృందం నివేదికను అందజేసింది. చెరువుల పూర్తి స్థాయి నీటిమట్టం (ఎఫ్‌టీఎల్‌) హద్దులను గుర్తించి, ఆక్రమణలను తొలగించి, పరిరక్షించాలని నివేదికలో పేర్కొంది.


రాష్ట్రవ్యాప్తంగా 44,170 చెరువులు..

రాష్ట్రవ్యాప్తంగా 44,170 చెరువులున్నాయని, అత్యధికంగా సిద్దిపేట జిల్లాలో 3,391, అత్యల్పంగా మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 514 చెరువులు ఉన్నాయని రైతు కమిషన్‌ తెలిపింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత చిన్న నీటి పారుదల వ్యవస్థను భారీ నీటి పారుదల వ్యవస్థలో విలీనం చేయడం వల్ల చెరువుల నిర్వహణలో లోపాలు చోటుచేసుకున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. బీఆర్‌ఎస్‌ హయాంలో చెరువుల పట్ల నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం వల్ల పరీవాహక ప్రాంతాలు దెబ్బతిని వర్షాకాలంలో చెరువులు నిండకపోవడం, భూగర్భ జలాలు క్షీణించడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయని వివరించింది. చెరువుల పరిరక్షణకు, పునరుద్ధరణ కోసం చిన్న నీటి పారుదలకు ప్రాధాన్యమిచ్చి ఒక ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని సూచించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు ఉన్న అన్ని విధానాలను పునరుద్ధరించి, గొలుసుకట్టు చెరువుల వ్యవస్థను బలోపేతం చేయడం, కఠినమైన నియంత్రణతో ఆక్రమణలను అరికట్టడం వంటి చర్యలు చేపట్టాలని పేర్కొంది. చిన్న నీటి వనరులను పరిరక్షించుకోవడానికి పంచాయతీరాజ్‌, నీటి వినియోగ సంఘాలకు స్పష్టమైన అధికారాలు, నిధులు ఇవ్వాలని తెలిపింది. చెరువుల పరిరక్షణకు బలమైన చెరువుల పరిరక్షణ కమిటీ(టీపీసీ)లను ఏర్పాటు చేయాలని, ఇందులో చైర్‌పర్సన్‌తో కలిపి మొత్తం 12 మంది సభ్యులుండాలని పేర్కొంది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ద్వారా ప్రధానమంత్రి కృషి సించాయి యోజన-హర్‌ ఖేత్‌కో పానీ పథకం అమలవుతోందని, దీని కింద చిన్న నీటి వనరుల మరమ్మతులు, పునరుద్ధరణకు ఆర్థిక సాయాన్ని అందిస్తోందని తెలిపింది. ఈ పథకం ద్వారా 2023-24లో చిన్న రాష్ట్రాలైన అరుణాచల్‌ప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌లకు వరుసగా రూ.142 కోట్లు, రూ.138 కోట్ల చొప్పున కేంద్ర సాయం అందితే.. 2019-2024లో తెలంగాణకు ఎలాంటి నిధులు అందలేదని వెల్లడించింది. ఈ పథకం కింద కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిధులను సాధించాల్సిన అవసరముందని రైతు కమిషన్‌ తెలిపింది. రెండేళ్ల కాలంలో రైతు కమిషన్‌ చేపట్టిన కార్యక్రమాలు, సర్కారుకు అందించిన సూచనలను సీఎంకు కమిషన్‌ సభ్యులు వివరించగా.. ఆయన కమిషన్‌ పనితీరును అభినందించారు.


ఇవీ చదవండి:

బాలికతో శృంగారం.. ఎమ్మెల్సీ రహ్మత్‌పై వేటు

భాగ్యనగరం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 30 , 2026 | 06:00 AM