భారత అంతరిక్ష రంగంలో కొత్త చరిత్ర.. 'విక్రమ్-1' ప్రయోగం విజయవంతం
ABN , Publish Date - Jul 18 , 2026 | 12:52 PM
భారత అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ ప్రైవేట్ స్పేస్టెక్ స్టార్టప్ 'స్కైరూట్ ఏరోస్పేస్' రూపొందించిన 'విక్రమ్-1' రాకెట్ ప్రయోగం విజయవంతమైంది.
ఇంటర్నెట్ డెస్క్: భారత అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ ప్రైవేట్ స్పేస్టెక్ స్టార్టప్ 'స్కైరూట్ ఏరోస్పేస్(Skyroot Aerospace) రూపొందించిన 'విక్రమ్-1' రాకెట్ శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం(షార్) నుంచి శనివారం మధ్యాహ్నం 12:05 గంటలకు చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమైంది. దీంతో ప్రభుత్వ ఆధ్వర్యంలోని అంతరిక్ష కార్యక్రమాలు సహా భారత ప్రైవేటు రంగం కూడా ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపగల సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటినట్లైంది. వాస్తవానికి నేడు ఉదయం 11.30 గంటలకు ప్రయోగం జరగాల్సి ఉండగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ప్రయోగానికి స్వల్ప అంతరాయం ఏర్పడింది. ఆ తర్వాత శాస్త్రవేత్తలు పరిశీలనలు చేపట్టి ఇంధన ప్రక్రియలో తలెత్తిన సమస్యను గుర్తించి సరిచేశారు. 35 నిమిషాల తర్వాత రాకెట్ను ప్రయోగించారు.
ఈ రాకెట్.. సాంకేతిక పేలోడ్లు సహా ప్రధాని నరేంద్ర మోదీ స్వహస్తాలతో 'వందేమాతరం' అని రాసి పంపిన ప్రత్యేక పోస్ట్కార్డును అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. వీటితో పాటు కాస్మోస్ డైమండ్స్ సంస్థ రూపొందించిన 'కాస్మిక్ బ్లూమ్' ఆర్ట్వర్క్, విక్రమ్-1 రాకెట్ సూక్ష్మ ప్రతిరూపాన్నీ నింగిలోకి పంపారు. దీనిపై సర్ సీవీ రామన్, విక్రమ్ సారాభాయ్, ఏపీజే అబ్దుల్ కలాం వంటి ప్రముఖుల సూక్ష్మరూపాలను చెక్కారు. అంతేకాకుండా.. ఈ ప్రయోగం విజయవంతం కావాలని కాంక్షిస్తూ స్కైరూట్ టీమ్ సహా ఇస్రో మాజీ ఛైర్మన్లు, శాస్త్రవేత్తలు, భారతీయ వ్యోమగాములు, ఇతరులు పంపిన డజన్ల కొద్దీ చేతిరాత పోస్ట్కార్డులనూ ప్రత్యేక పేలోడ్ బాక్స్లో భద్రపరిచారు.
స్కైరూట్ సంస్థ 'మిషన్ ఆగమన్' పేరిట ఈ ప్రయోగం చేపట్టింది. భారత ప్రైవేట్ అంతరిక్ష రంగం ఆర్బిటాల్ ప్రయోగాల యుగంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ మిషన్కు ఆ పేరు పెట్టింది. విక్రమ్-1 ద్వారా గ్రహాస్పేస్, కాస్మోసెర్వ్, డీక్యూబ్డ్ సంస్థలకు చెందిన టెక్నాలజీ డెమానిస్ట్రేషన్ పేలోడ్లు సహా స్కైరూట్కు చెందిన 'స్కోప్'ను కూడా అంతరిక్షంలోకి పంపారు. ఈ ప్రయోగం ద్వారా రాకెట్లోని ప్రొపల్షన్, స్టేజ్ సెపరేషన్, గైడెన్స్, నావిగేషన్, కంట్రోల్ వ్యవస్థల పనితీరును అంతరిక్ష ప్రయాణంలో పరీక్షించి తద్వారా కీలక సమాచారం రాబట్టనున్నారు. దీంతో రానున్న కాలంలో వాణిజ్య ప్రయోగాల అవసరాలకు సాంకేతిక సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవడమే లక్ష్యంగా స్కైరూట్ ముందడుగేస్తోంది.
ఇక.. సుమారు ఏడంతస్తుల భవనం ఎత్తులో రూపొందిన విక్రమ్-1 పూర్తిగా కార్బన్ కాంపోజిట్ నిర్మాణంతో తయారైంది. దేశీయంగా అభివృద్ధి చేసిన 3డీ ప్రింటెడ్ ఇంజిన్లు, ఘన ఇంధన బూస్టర్లతో పనిచేసే ఈ రాకెట్ 350 కిలోల వరకు చిన్న ఉపగ్రహాలను 450 కిలోమీటర్ల ఎత్తులోని లోఎర్త్ ఆర్బిట్(LEO)లో ప్రవేశపెట్టే సామర్థ్యాన్ని కలిగి ఉంది. 2022లో విక్రమ్-ఎస్ ద్వారా తొలి ప్రైవేట్ రాకెట్ను విజయవంతంగా కక్ష్యలోకి పంపిన స్కైరూట్.. ఇప్పుడు విక్రమ్-1తో తొలి దేశీయ ప్రైవేట్ ఆర్బిటాల్ ప్రయోగం చేపట్టింది.
ఈ ప్రయోగాన్ని ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రత్యక్షంగా వీక్షించారు. కుమారుడు దేవాన్శ్తో కలిసి శ్రీహరికోటకు వెళ్లిన లోకేశ్.. ఇస్రో గ్యాలరీ నుంచి 'విక్రమ్-1' ప్రయోగాన్ని వీక్షించారు. ఇస్రో మాజీ ఛైర్మన్లు, సీనియర్ శాస్త్రవేత్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇవీ చదవండి:
ఆమిర్ ఖాన్కు బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో బెదిరింపు.. మూడో పెళ్లిపై వివాదం మరింత ముదురుతోందా..
హోటల్ లిఫ్ట్లో చిక్కుకున్న శశి థరూర్.. అరగంట తర్వాత సురక్షితంగా బయటకు..