Share News

శ్రేయస్‌కు బ్యాకప్‌గా తిలక్ వర్మ!.. గంభీర్, అగార్కర్ ప్లాన్ అదేనా?

ABN , Publish Date - Aug 31 , 2026 | 09:19 AM

2027 వన్డే ప్రపంచకప్‌పై టీమిండియా ఇప్పటి నుంచే దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో జట్టు కూర్పుపై ప్రధాన కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌, కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌, చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

శ్రేయస్‌కు బ్యాకప్‌గా తిలక్ వర్మ!.. గంభీర్, అగార్కర్ ప్లాన్ అదేనా?
Gautam Gambhir, Ajit Agarkar

ఇంటర్నెట్ డెస్క్: 2027 వన్డే ప్రపంచకప్‌పై టీమిండియా ఇప్పటి నుంచే దృష్టి సారించింది. 2023 ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత జట్టు పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో జట్టు కూర్పుపై ప్రధాన కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌, కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌, చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మిడిలార్డర్‌లో సరైన బ్యాకప్‌ లేకపోవడం టీమ్‌ మేనేజ్‌మెంట్‌ను ఆందోళనకు గురిచేస్తోందని సమాచారం. స్టార్‌ ఆల్‌రౌండర్లు హార్దిక్‌ పాండ్య, నితీశ్‌ కుమార్‌ రెడ్డి తరచూ గాయాల బారిన పడుతుండటంతో.. అదనపు బౌలింగ్‌ ఆప్షన్‌ ఉన్న ఆటగాడి కోసం అన్వేషణ మొదలైంది.


మిడిలార్డర్‌లో శ్రేయస్‌ అయ్యర్‌కు ప్రత్యామ్నాయంగా తిలక్‌ వర్మను టీమ్‌ మేనేజ్‌మెంట్‌ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఒత్తిడిలోనూ రాణించే సామర్థ్యంతో పాటు బంతితోనూ కొన్ని ఓవర్లు వేయగలగడం తిలక్‌కు కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. వన్డేల్లో తిలక్‌ జట్టులోకి వస్తే ప్రధాన బౌలర్లపై భారం కొంత తగ్గుతుందని, అదే సమయంలో జట్టు బ్యాటింగ్‌-బౌలింగ్‌ సమతూకం మెరుగవుతుందని గంభీర్‌, గిల్‌ భావిస్తున్నట్లు సమాచారం.


దక్షిణాఫ్రికా పరిస్థితులే అసలు పరీక్ష..

2027 ప్రపంచకప్‌ దక్షిణాఫ్రికాలో జరగనుండటంతో అక్కడి పిచ్‌లు, పేస్‌, బౌన్స్‌ను ఎదుర్కొనే ఆటగాళ్లను ఇప్పటి నుంచే సిద్ధం చేయాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. ఇక భారత జట్టులో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ ఫిట్‌నెస్‌పైనా ప్రశ్నలు ఉన్నాయి. ప్రపంచకప్‌ సమయానికి కేఎల్‌ రాహుల్‌ వయసు కూడా 35 ఏళ్లు దాటనుంది. రవీంద్ర జడేజా స్థానంపైనా ఇప్పుడే స్పష్టత లేదని తెలుస్తోంది. ఫిట్‌నెస్ సమస్యల కారణంగా జట్టు ఫీల్డింగ్ ప్రమాణాలు కూడా ప్రభావితం అవుతాయి. కాబట్టి యువ ప్లేయర్లను బ్యాకప్‌గా సిద్ధం చేయాలని మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం.


న్యూజిలాండ్‌ సిరీస్‌ కీలకం

ప్రపంచకప్‌ సన్నాహకాలకు అసలు ఊపొచ్చేది అక్టోబర్‌లో జరిగే న్యూజిలాండ్‌ పర్యటనతో అని సమాచారం. భారత్‌ అక్కడ ఐదు వన్డేల సిరీస్‌ ఆడనుంది. ఈ సిరీస్‌లో కొత్త కాంబినేషన్లను పరీక్షించడంతో పాటు యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చే అవకాశం ఉంది. సెప్టెంబర్‌ 27 నుంచి వెస్టిండీస్‌తో భారత్‌ మూడు వన్డేల సిరీస్‌ ఆడనుంది. అయితే ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు జపాన్‌కు పూర్తి స్థాయి టీ20 జట్టు వెళ్లే అవకాశం ఉండటంతో.. పలువురు సీనియర్‌ ఆటగాళ్లు వెస్టిండీస్‌ సిరీస్‌కు దూరంగా ఉండొచ్చని తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి:

కౌంటీ ఛాంపియన్‌షిప్: ఆకిబ్ నబీకి సర్‌ప్రైజ్ ఛాన్స్.. సర్రే జట్టు తరఫున..

ప్రపంచ రికార్డు.. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌‌గా దీప్తి శర్మ

Updated Date - Aug 31 , 2026 | 09:19 AM