వన్డే ప్రపంచ కప్ 2027: రో-కో కోసం కివీస్ పర్యటనలో మార్పులు!
ABN , Publish Date - Mar 04 , 2026 | 04:11 PM
టీమిండియా వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పటికే టెస్ట్, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ వీరిద్దరి కోసం ఓ కీలక ప్రణాళిక సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 ముగిసిన తర్వాత బీసీసీఐ తన దృష్టిని మొత్తం 2027లో జరగనున్న వన్డే ప్రపంచ కప్ వైపు మళ్లించనుంది. టీమిండియా వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పటికే టెస్ట్, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. రానున్న వన్డే వరల్డ్ కప్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ వీరిద్దరి కోసం ఓ కీలక ప్రణాళిక సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ ఏడాది అక్టోబర్-నవంబర్లో టీమిండియా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. షెడ్యూల్ ప్రకారం అక్కడ ఐదు టీ20లు, రెండు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే టీ20 సిరీస్ను తగ్గించి.. వన్డే సిరీస్లో అదనంగా రెండు మ్యాచ్లు పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం. వన్డే ప్రపంచ కప్ సమీపిస్తోన్న తరుణంలో రోహిత్, విరాట్ కోసం బీసీసీఐ ఈ మార్పు చేయనుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
ఈ ఆలోచన ఎవరిదంటే..
ఈ ప్రతిపాదనను న్యూజిలాండ్ క్రికెట్ బోర్డే బీసీసీఐకి పంపినట్లు తెలుస్తోంది. వన్డే మ్యాచ్లు పెరిగితే రోహిత్, విరాట్ లాంటి స్టార్ ప్లేయర్లు ఎక్కువగా మైదానంలో ఉండే అవకాశం ఉంటుంది. దీంతో టీవీ రేటింగ్స్, స్పాన్సర్ల ఆదాయం కూడా పెరుగుతుందని న్యూజిలాండ్ భావిస్తోంది. ఈ ప్రతిపాదనకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అయితే ఈ అంశంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా త్వరలోనే కొత్త షెడ్యూల్ను ఖరారు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఏడాది టీమిండియా.. జూన్లో అఫ్గానిస్తాన్, జులైలో ఇంగ్లండ్, ఆ తర్వాత వెస్టిండీస్, ఏడాది చివరిలో శ్రీలంక జట్లతో వన్డే సిరీస్లు ఆడనుంది. సిరీస్లన్నీ వరల్డ్ కప్నకు సన్నాహకంగా ఉపయోగపడనున్నాయి.
ఇవి కూడా చదవండి:
టీ20 ప్రపంచ కప్ వ్యూయర్ షిప్లో సంచలన రికార్డ్!
ఐపీఎల్ 2026: చిన్నస్వామి స్టేడియంలోనే ఫైనల్ పోరు