భారత పురుషుల క్రికెట్ జట్టుకూ కిట్ కష్టాలు
ABN , Publish Date - Sep 19 , 2026 | 02:09 PM
ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న టీమిండియాకు కిట్ కష్టాలు ఎదురయ్యాయి. కొంతమంది ఆటగాళ్లకు జెర్సీ సైజులు సరిపోకపోవడంతో కొత్త కిట్ల కోసం బీసీసీఐ.. కిట్ సప్లయర్ను సంప్రదించింది. ఇదిలా ఉంటే, శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు రేపు జపాన్ బయల్దేరనుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న భారత పురుషుల క్రికెట్ జట్టునూ కిట్ కష్టాలు వెంటాడుతున్నాయి. కిట్ సైజుల ఇష్యూతో టీమ్ ఇండియాకు ఈ కష్టం వచ్చింది. కొంతమంది ఆటగాళ్లకు జెర్సీల సైజు సరిపోలేదు. ఈ నేపథ్యంలో కొత్త జెర్సీలను అందిస్తున్నారు. అవి ఇంకా సిద్ధం కాలేదు. దీంతో భారత ఒలింపిక్ అసోసియేషన్ కిట్ సప్లయర్ అయిన జేఎస్డబ్ల్యూ ఇన్స్పైర్ను బీసీసీఐ విచారించింది. కిట్ల జాప్యానికి గల కారణాలను బీసీసీఐ అడిగి తెలుసుకుంది. కాగా.. చాలా మంది ప్లేయర్ల కిట్ సమస్యలు తీరిపోయాయని, కొంతమందికి మాత్రమే కిట్లు అందాల్సి ఉందని జేఎస్డబ్ల్యూ ఇన్స్పైర్కు చెందిన ఓ అధికారి ఓ వార్తా సంస్థకు వెల్లడించారు.
రేపే జపాన్ బయల్దేరనున్న జట్టు
శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు ఆదివారం తెల్లవారుజామున జపాన్కు బయల్దేరనుంది. ఆ క్రీడల్లో మన జట్టు ప్లేయర్లు రెండు రకాల జెర్సీలు ధరిస్తారు. ఆసియా క్రీడల ప్రారంభ కార్యక్రమంలో ఒక జెర్సీ ధరించనుండగా.. టీ20 ఇంటర్నేషనల్ ఆటల్లో ఎప్పట్లాగే సాధారణ జెర్సీలు వేసుకుంటారు. ఇక ఈనెల 22న జపాన్తో టీమిండియా తలపడనుంది. కాగా.. షూటర్ మనూ బాకర్తో పతాకధారిగా ఉండాల్సిన తజిందర్ పాల్ సింగ్ తూర్.. కిట్ల సమస్య కారణంగా ఆ అవకాశాన్ని కోల్పోయాడు. దీంతో అతడి స్థానంలో కబడ్డీ ప్లేయర్ పవన్ షెరావత్ను ఎంపిక చేశారు. మరోవైపు నగోయాలో నిర్వాహకులు కేటాయించిన గదుల విషయంపై ఆందోళనలు నెలకొనడంతో పురుషుల క్రికెట్ టీం సభ్యుల కోసం బీసీసీఐ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది.
ఇవీ చదవండి:
ఆసియా గేమ్స్: సెమీ ఫైనల్ గ్రౌండ్పై వెల్లువెత్తుతున్న ఆందోళనలు
నేటినుంచే మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్