జడేజా, కుల్దీప్ యాదవ్ల మధ్య వాగ్వాదం.. వీడియో వైరల్
ABN , Publish Date - May 02 , 2026 | 01:08 PM
ఐపీఎల్ 2026లో నిన్న రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు మధ్య జరిగిన మ్యాచ్లో ఒక సరదా సంఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మ్యాచ్ మధ్యలో రాజస్థాన్ ఇన్నింగ్స్ సమయంలో జడేజా, కుల్దీప్ మధ్య జరిగిన సరదా వాగ్వాదం అభిమానులను ఆకట్టుకుంది.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న(శుక్రవారం) జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మ్యాచ్ మధ్యలో రాజస్థాన్ ఇన్నింగ్స్ సమయంలో రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ మధ్య వాగ్వాదం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సన్నివేశం చూసిన క్రికెట్ అభిమానులు కాసేపు షాక్ కు గురయ్యారు. అసలు విషయం ఏమింటే..
రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేయడానికి క్రీజులోకి వచ్చిన సమయంలో అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న ఢిల్లీ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను ఆటపట్టించాలని భావించాడు. కుల్దీప్ యాదవ్ దగ్గరకు వెళ్లిన జడేజా తన ట్రేడ్మార్క్ స్టైల్లో బ్యాట్ను గాలిలో వేగంగా తిప్పుతాడు. అది కుల్దీప్ ముఖానికి తగిలేలా ఊపడంతో.. పాపం కుల్దీప్ ఒక్కసారిగా షాక్కు గురై భయంతో వెనక్కి జరిగాడు. అయితే ఈ వీడియోను మొదటిసారి చూసిన వారికి జడేజా బ్యాట్ నేరుగా కుల్దీప్కు తగిలిందేమో అనే భావన కలుగుతుంది.
వాస్తవానికి వారిద్దరి మధ్య కొంత దూరం ఉంది. మొత్తానికి తన ప్లాన్ వర్కవుట్ కావడంతో జడేజా నవ్వుతుండగా.. కుల్దీప్ కూడా తేరుకుని నవ్వుతూ జడేజాను పక్కకు నెట్టడం కనిపించింది. అంపైర్లు జడేజా బ్యాట్ను తనిఖీ చేస్తున్న సమయంలో ఈ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. ఈ సన్నివేశంతో కాసేపు మైదానంలోని ఆటగాళ్లు, అంపైర్లు, స్టేడియంలోని ప్రేక్షకులు నవ్వుల్లో మునిగిపోయారు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్..
ఐపీఎల్లో అత్యధిక 'పీవోటీఎం' అవార్డులు అందుకున్న ప్లేయర్లు వీరే