శ్రీలంకతో టెస్టు సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ
ABN , Publish Date - Jul 28 , 2026 | 10:47 AM
శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు బీసీసీఐ మంగళవారం భారత జట్టును ప్రకటించింది. అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ మంగళవారం జట్టు వివరాలను వెల్లడించింది. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు జట్టులో స్థానం దక్కింది.
స్పోర్ట్స్ డెస్క్: ఇటీవల జింబాబ్వేతో మూడు టీ20 మ్యాచ్ల సిరీస్ను 3-0తేడాతో భారత్ జట్టు కైవసం చేసుకుంది. వచ్చే నెలలో శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఇవాళ(మంగళవారం) భారత జట్టును ప్రకటించింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను వెల్లడించింది. ఈ టెస్టు సిరీస్కు శుభ్మన్ గిల్ నాయకత్వం వహించనున్నాడు. అలానే కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్గా ఉండనున్నాడు.
బీసీసీఐ ప్రకటించిన జట్టులో టీమిండియా సీనియర్ ప్లేయర్ రవీంద్ర జడేజాకు చోటుదక్కింది. దాదాపు ఏడాది తర్వాత జడేజా టెస్టుల్లో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. సారాన్ష్ జైన్కు తొలిసారి భారత జట్టులో చోటు దక్కింది. మధ్యప్రదేశ్ తరపున 131 ఫస్ట్-క్లాస్ వికెట్లు సాధించిన జైన్, ఇటీవల శ్రీలంక 'ఎ' జట్టుపై ఇండియా 'ఎ' తరపున అద్భుత ప్రదర్శనలతో జట్టులో తన స్థానాన్ని పదిలపరుచుకున్నాడు.
అలానే జస్ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్ లను ఎంపిక చేసినప్పటికీ సిరీస్ ప్రారంభమయ్యే సమయానికి ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి 19 మధ్య గాలే వేదికగా జరగనుంది. ఆగస్టు 23 నుంచి 27 వరకు జరిగే రెండో టెస్టుకు కొలంబో వేదిక కానుంది. ఈ సిరీస్కు ముందు భారత జట్టు ఆగస్టు 7వ తేదీ నుంచి కొలంబోలో నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది.
శ్రీలంకతో టెస్టులకు భారత జట్టు:
శుభ్మన్ గిల్ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సరన్ష్ జైన్
ఇవి కూడా చదవండి:
తండ్రి బాటలో తనయుడి విజయం.. కామన్వెల్త్లో తెలుగుకుర్రాడికి రజతం
చరిత్ర సృష్టించిన షర్మిల.. పారా అథ్లెటిక్స్లో భారత్కు తొలి స్వర్ణం