ఆ ఆస్పత్రులు ఉచిత సేవలు ఇవ్వాల్సిందే: సుప్రీంకోర్టు
ABN , Publish Date - May 20 , 2026 | 06:41 PM
ప్రభుత్వ భూములు రాయితీపై తీసుకున్న ఆస్పత్రులు ఉచిత సేవలు ఇవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆర్థికంగా బలహీన వర్గాల వారికి ఉచిత చికిత్సను అమలు చేయడానికి విధివిధానాలను రూపొందించాలని ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఢిల్లీ, మే 20 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ భూములను రాయితీ ధరలకు పొందిన ప్రైవేట్ ఆస్పత్రులు ఆర్థికంగా బలహీన వర్గాలకు (EWS) తప్పనిసరిగా ఉచిత వైద్య సేవలు అందించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వానికి ప్రామాణిక కార్యాచరణ విధానం (SOP) రూపొందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఢిల్లీలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో EWS రోగులకు ఉచిత చికిత్స అమలు విషయంలో కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గతంలో కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ 51 ఆస్పత్రుల్లో కేవలం నాలుగు ఆస్పత్రులే నిబంధనలు పాటిస్తున్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఉచిత చికిత్స తప్పనిసరి..
ప్రైవేట్ ఆస్పత్రులు తమ ఇన్పేషెంట్ విభాగంలో (IPD) 10 శాతం, అవుట్పేషెంట్ విభాగంలో (OPD) 25 శాతం వరకు ఉచిత చికిత్స అందించడం తప్పనిసరని మరోసారి స్పష్టం చేసింది. 2018లో ఇచ్చిన తీర్పును సమర్థవంతంగా అమలు చేయడానికి స్పష్టమైన SOP రూపొందించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. న్యాయస్థానం తీర్పును ఉల్లంఘించినట్లు తేలిన 51 ఆస్పత్రుల్లో మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, వేంకటేశ్వర, మూల్ చంద్ హాస్పిటల్స్ ఉన్నాయి.
23న ఉన్నతస్థాయి సమావేశం..
కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్లు తేలిన ఆస్పత్రులపై గతంలో ధిక్కరణ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడైంది. ఈ అంశంపై ఢిల్లీ ప్రభుత్వం, సంబంధిత అధికారులు, ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మే 23వ తేదీన ఢిల్లీ సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది. ‘యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ మూల్చంద్ ఖైరతీ రామ్ ట్రస్ట్’ కేసులో జస్టిస్ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వీ అంజారియాతో కూడిన ధర్మాసనం ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి...
కేసీఆర్ హయాంలో ఆ ప్రాజెక్టుకు భూసేకరణ లేకుండానే టెండర్లు పిలిచారు.. మంత్రి ధ్వజం
టీజీ పీజీఈసెట్ పరీక్ష షెడ్యూల్ మార్పు.. కొత్త తేదీ ఇదే
అక్రమాస్తుల కేసులో జలమండలి జనరల్ మేనేజర్ అరెస్ట్
Read Latest Telangana News And AP News And International News And Telugu News