గానగాంధర్వి జానకి మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం
ABN , Publish Date - Jul 12 , 2026 | 11:43 AM
ప్రముఖ గాయని ఎస్.జానకి మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. జానకి కుటుంబసభ్యులకు, అభిమానులకు, సంగీత ప్రపంచానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ 'ఓం శాంతి' అంటూ నివాళులర్పించారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ గాయని ఎస్.జానకి మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణం సంగీత, సాంస్కృతిక ప్రపంచానికి తీరని లోటు అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఎక్స్ వేదికగా సంతాపం తెలిపారు.
'ఎస్.జానకమ్మ మరణం సంగీత ప్రపంచానికే కాకుండా.. భారతీయ సంస్కృతికీ తీరని లోటు. పలు భాషల్లో ఆమె ఆలపించిన పాటలు తరతరాల శ్రోతలను అలరించాయి. ప్రతి భావానికీ తన అసమాన గాత్రంతో ప్రాణం పోసిన మహా గాయని ఆమె. జానకమ్మ ఆలపించిన మధుర గీతాలు ఎప్పటికీ సంగీతాభిమానులను అలరిస్తూనే ఉంటాయి' అని పేర్కొన్నారు మోదీ. జానకి కుటుంబసభ్యులకు, అభిమానులకు, సంగీత ప్రపంచానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ 'ఓం శాంతి' అంటూ నివాళులర్పించారు.
వయోభారంతో అనారోగ్యానికి గురైన ఎస్.జానకి(88) శనివారం మైసూరులో తుదిశ్వాస విడిచారు. ఆరు దశాబ్దాలకు పైగా సాగిన సంగీత ప్రస్థానంలో ఆమె సుమారు 48 వేలకుపైగా పాటలు ఆలపించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఒడియా, ఉర్దూ, పంజాబీ, బెంగాలీ సహా దాదాపు 20 భారతీయ భాషల్లో ఆమె గాత్రమాధుర్యాన్ని పంచారు. సినీ గీతాలతో పాటు ఆల్బమ్లు, టెలివిజన్, రేడియో కార్యక్రమాల ద్వారా కూడా ఆమె విశేష గుర్తింపు పొందారు. అసమాన గాన ప్రతిభతో కోట్లాది సంగీత అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన జానకమ్మ స్వరం తరతరాలకు చిరస్మరణీయంగా నిలిచిపోనుంది.
ఇవీ చదవండి:
ఐఐటీ కాదు.. ప్రతిభకే పట్టం.. అదిరే ప్యాకేజీతో అమెరికాలో జాబ్
30 సెకన్లలో 195 ముద్దులు.. గిన్నిస్ రికార్డు దాసోహం!