Share News

మోదీపై అభ్యంతరకర పోస్టులు.. మెటా ఇండియా హెడ్‌పై కేసు

ABN , Publish Date - Jul 31 , 2026 | 11:05 AM

ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని సోషల్‌ మీడియా వేదికలపై అభ్యంతరకర, మార్ఫింగ్‌ చేసిన వీడియోలు, చిత్రాల ప్రచారానికి సంబంధించి హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు.

మోదీపై అభ్యంతరకర పోస్టులు.. మెటా ఇండియా హెడ్‌పై కేసు

ఇంటర్నెట్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని సోషల్‌ మీడియా వేదికలపై అభ్యంతరకర, మార్ఫింగ్‌ చేసిన వీడియోలు, చిత్రాల ప్రచారానికి సంబంధించి హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు. మెటా ఇండియా అధిపతి అరుణ్‌ శ్రీనివాస్‌తో పాటు పలు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలపై ఈ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.


ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రౌజ్‌ చేస్తుండగా ప్రధాని మోదీ సంబంధిత కొన్ని మార్ఫింగ్‌ చేసిన, డిజిటల్‌గా మార్పులు చేసిన వీడియోలు, చిత్రాలు కనిపించాయని ఇద్దరు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీటిలో అసభ్యకరమైన, అవమానకరమైన వ్యాఖ్యలు ఉండటం సహా ప్రజలను తప్పుదోవ పట్టించేలా కంటెంట్‌ను రూపొందించి ప్రచారం చేశారని ఫిర్యాదుదారులు ఆరోపించారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సోషల్‌ మీడియా అకౌంట్ల ద్వారా వైరల్ అయిన కంటెంట్‌ మూలాలు, వాటి ప్రచారం వెనుక ఉన్న వ్యక్తుల వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం.


కాగా.. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఇటీవల విద్యార్థుల ఆందోళనల సమయంలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా కొన్ని పోస్టులు, వ్యాఖ్యలు అసభ్యకరమైన భాషలో ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి. దీంతో పలు సోషల్‌ మీడియా ఖాతాలపై నిఘా పెరిగింది. ఇదిలా ఉండగా.. ప్రధాని మోదీ ఖాతా నుంచి పోస్ట్ చేసిన ఓ వీడియో కొంతకాలం ఫేస్‌బుక్‌లో నిలిపివేయడంతో మెటాపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మెటా ప్రతినిధులు ప్రభుత్వానికి వివరణ ఇచ్చి, ప్రముఖ ఖాతాలకు అదనపు పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.


మరోవైపు.. అభ్యంతరకర పోస్టులు, వీడియోలను తొలగించాలని ఢిల్లీ పోలీసులు కూడా పలు సోషల్‌ మీడియా సంస్థలకు సూచనలు జారీ చేశారు. ప్రజా శాంతికి భంగం కలిగించే, ద్వేషాన్ని రెచ్చగొట్టే లేదా వ్యక్తుల ప్రతిష్ఠకు భంగం కలిగించే కంటెంట్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.


ఇవీ చదవండి:

మహారాష్ట్రలోని భివండిలో ఘోర ప్రమాదం.. తొమ్మిది మంది మృతి..

చోరీకి ముందు దేవుళ్లకు క్షమాపణ.. వీడియో వైరల్

Updated Date - Jul 31 , 2026 | 11:06 AM