ఆ పోస్టులు తొలగించండి.. ఎక్స్కు ఢిల్లీ పోలీసుల నోటీసులు
ABN , Publish Date - Jul 30 , 2026 | 10:54 AM
సోషల్ మీడియా వేదికగా వ్యాప్తి చెందుతున్న వివాదాస్పద పోస్టులపై ఢిల్లీ పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని అభ్యంతరకరమైన పోస్టులు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఢిల్లీ, జులై 30 (ఆంధ్రజ్యోతి): సోషల్ మీడియా వేదికగా వ్యాప్తి చెందుతున్న వివాదాస్పద పోస్టులపై ఢిల్లీ పోలీసులు (Delhi Police) చర్యలు చేపట్టారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో (PM Narendra Modi) పాటు రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని అభ్యంతరకరమైన పోస్టులు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఎక్స్ ప్లాట్ఫామ్కు నోటీసులు జారీ చేశారు. ప్రజల్లో ఉద్రిక్తతలు, అపోహలు సృష్టించే కంటెంట్ను వెంటనే తొలగించాలని ఎక్స్ను ఆదేశించారు.
సీజేపీ నిరసనల సమయంలో ప్రధాని మోదీని ఉద్దేశించి కొన్ని అభ్యంతరకరమైన పోస్టులు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యాయని పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో మొత్తం 6996 ఖాతాలను గుర్తించినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఈ ఖాతాలకు సంబంధించిన వివాదాస్పద పోస్టులు, URLల యాక్సెస్ను తొలగించాలని ఎక్స్ ప్లాట్ఫామ్కు సూచించారు. అంతేకాకుండా, భవిష్యత్తులో జరిగే దర్యాప్తు కోసం సంబంధిత యూజర్ల వివరాలు, లాగిన్స్ వంటి కీలక సమాచారాన్ని భద్రపరచాలని పోలీసులు ఆదేశించారు. సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు స్పష్టం చేశారు.
ఈ కేసుల్లో భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు కీలక సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. క్రిమినల్ బెదిరింపులకు సంబంధించిన సెక్షన్ 351(3), ప్రజల్లో భయాందోళనలు లేదా అలజడి సృష్టించే చర్యలకు సంబంధించిన సెక్షన్ 353, పరువు నష్టం (డిఫమేషన్)కు సంబంధించిన సెక్షన్ 356 కింద చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
ఇదిలా ఉండగా, జులై 20వ తేదీన సెంట్రల్ ఢిల్లీలో జరిగిన ఆందోళనలకు సంబంధించి వ్యాపించిన మరో సమాచారాన్ని కూడా ఢిల్లీ పోలీసులు ఖండించారు. ఆ నిరసన సమయంలో ఓ వ్యక్తికి తుపాకీ గాయమైందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన వార్తలను పోలీసులు ఫేక్ న్యూస్గా పేర్కొన్నారు.
డాక్టర్ల మెడికల్ లీగల్ కేసు (MLC) నివేదికలో తుపాకీ గాయానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఎక్స్ ప్లాట్ఫామ్ వేదికగా అధికారికంగా వెల్లడించారు. ప్రజలు ధ్రువీకరణ లేని సమాచారాన్ని నమ్మవద్దని, తప్పుడు వార్తలను వ్యాప్తి చేయకుండా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. సోషల్ మీడియా వేదికలపై చట్టవిరుద్ధమైన లేదా విద్వేషపూరిత కంటెంట్ వ్యాప్తిపై కఠిన నిఘా కొనసాగుతోందని స్పష్టం చేశారు. డిజిటల్ ప్లాట్ఫామ్లలో బాధ్యతాయుతమైన వినియోగం అవసరమని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు.
వార్తలు కూడా చదవండి...
చంద్రబాబు దూరదృష్టితో కుప్పంకు ఇజ్రాయిల్ టెక్నాలజీ: నారా భువనేశ్వరి
జీవ వైవిధ్య పరిరక్షణలో పులుల పాత్ర అమోఘం: పవన్ కల్యాణ్
ఏపీ మద్యం స్కాం.. కారుమూరికి సుప్రీంకోర్టులో షాక్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News