యువరాజ్ సింగ్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
ABN , Publish Date - Aug 02 , 2026 | 03:49 PM
టీమిండియా మాజీ స్టార్ ఆల్రౌండర్, ప్రపంచకప్ హీరో యువరాజ్ సింగ్ వ్యక్తిగత హక్కులు, గోప్యతకు భంగం కలిగించవద్దని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం యువీ ఫొటోలను ఉపయోగించకూడదని థర్డ్ పార్టీలను నియంత్రిస్తూ జస్టిస్ జ్యోతి సింగ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 02: టీమిండియా మాజీ స్టార్ ఆల్రౌండర్, ప్రపంచకప్ హీరో యువరాజ్ సింగ్ వ్యక్తిగత హక్కులు, గోప్యతకు భంగం కలిగించవద్దని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. యువీ అనుమతి లేకుండా అతడి పేరు, ఫొటోలు, గొంతును వాణిజ్య లేదా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని థర్డ్ పార్టీలను నియంత్రిస్తూ జస్టిస్ జ్యోతి సింగ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో సృష్టించిన డీప్ఫేక్ వీడియోలు, వివాదాస్పద ఫొటోలు తన ప్రతిష్ఠను దిగజార్చేలా ఉన్నాయని, టీషర్టులు, ఇతర వస్తువులపై తన పేరును అక్రమంగా వాడుకుంటూ వ్యాపారం చేస్తున్నారని యువరాజ్ హైకోర్టును ఆశ్రయించాడు. ఇతర క్రీడాకారులపై దాడి చేస్తున్నట్లు, మతపరమైన భావాలను దెబ్బతీసేలా, అసభ్యకరమైన భాషతో కూడిన డీప్ఫేక్ కంటెంట్ను సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారని అతడి తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ జ్యోతి సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'సుదీర్ఘ కాలం పాటు దేశానికి ప్రాతినిధ్యం వహించిన యువరాజ్ ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఆయన కష్టపడి సాధించిన నమ్మకాన్ని, గౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి' అని వ్యాఖ్యానించారు. యువరాజ్ ఆమోదం లేకుండా రూపొందించిన అభ్యంతరకర పోస్టులు, వీడియోలను తక్షణమే తొలగించాలని మెటా (Meta) సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను కోర్టు ఆదేశించింది.
గతంలో కూడా ఐశ్వర్య రాయ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, పవన్ కల్యాణ్, రవిశంకర్ వంటి ప్రముఖులు తమ వ్యక్తిగత హక్కుల రక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. తాజాగా యువరాజ్ సింగ్ విషయంలోనూ కోర్టు ఇచ్చిన ఈ తీర్పు డీప్ఫేక్, అక్రమ వాణిజ్య వినియోగానికి చెక్ పెట్టేలా ఉంది.
ఇవి కూడా చదవండి:
భారత జట్టుకు బిగ్ షాక్.. కీలక ప్లేయర్ ఔట్
తైపీ ఓపెన్: చరిత్ర సృష్టించిన తన్వి శర్మ.. 18 ఏళ్ల తర్వాత భారత్కు టైటిల్