కాల్పుల విరమణకు తూట్లు.. లెబనాన్పై ఇజ్రాయెల్ మళ్లీ దాడులు
ABN , Publish Date - Jun 20 , 2026 | 01:42 PM
ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన కొద్ది గంటల్లోనే దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడటం కలకలం రేపుతోంది. పశ్చిమాసియాలో శాంతి వాతావరణం నెలకొనాల్సిన నేపథ్యంలో తాజా ఘటనతో మరోసారి ఉద్రిక్తతలకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన గంటల వ్యవధిలోనే దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఈ వైమానిక, డ్రోన్ దాడుల్లో కనీసం ఐదుగురు మృతిచెందగా, పలువురు గాయపడినట్టు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.
లెబనాన్లోని నబతియెహ్ ప్రాంతంలోని పలు ప్రాంతాలపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు, డ్రోన్లతో దాడులకు దిగింది. ఈ ఘటనలో అనేక నివాస భవనాలు ధ్వంసమయ్యాయి. కాల్పుల విరమణ అమల్లోకి రావడంతో శాంతి నెలకొంటుందని ఆశించిన స్థానికుల్లో తాజా దాడులు తీవ్ర ఆందోళనకు దారితీశాయి. ఇక.. ఈ దాడులకు ముందు రాత్రి కూడా అదే ప్రాంతంలో భారీ బాంబుదాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో కనీసం 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడగా, పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు స్థానిక అధికారులు పేర్కొన్నారు.
అమెరికా, ఖతార్, ఇరాన్ దేశాల మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య శుక్రవారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్టు అమెరికా అధికారులు ప్రకటించారు. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ అగ్రీమెంట్ అమల్లోకి వచ్చిందన్నారు. దక్షిణ లెబనాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించడం, పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలకు ఊతమివ్వడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అయితే.. ఒప్పందం అమల్లోకి రాగానే దాడులు కొనసాగడం వల్ల శాంతి ప్రక్రియపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగే అవకాశమున్నట్టు పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇవీ చదవండి:
నెతన్యాహు ఓ యోధుడిలాంటి ప్రధాని.. డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు
'మీరు నిశ్శబ్దంగా ఉండండి'.. ఐరాస అధికారిపై ఇజ్రాయెల్ దౌత్యవేత్త ఆగ్రహం