3 కేసుల్లో రూ.35 లక్షలు హాంఫట్!
ABN , Publish Date - Sep 12 , 2026 | 08:34 AM
సైబర్ నేరగాళ్లు ఒకేరోజు మూడు వేర్వేరు కేసుల్లో రూ.లక్షలు దోచుకున్నారు. స్టాక్ మార్కెట్, ఐపీఓ లాభాల పేరుతో రూ.35 లక్షల వరకు దోచేశారు.
స్టాక్ మార్కెట్ పేరుతో రూ.15.02 లక్షలు..
ఐపీఓలో లాభాల పేరుతో రూ.19.64 లక్షలు
హైదరాబాద్ సిటీ: సైబర్ నేరగాళ్లు ఒకేరోజు మూడు వేర్వేరు కేసుల్లో రూ.లక్షలు దోచుకున్నారు. స్టాక్ మార్కెట్, ఐపీఓ లాభాల పేరుతో రూ.35 లక్షల వరకు దోచేశారు.
ఐటీ ఉద్యోగి నుంచి..
స్టాక్ మార్కెట్లో భారీ లాభాలు వస్తాయంటూ వాట్సాప్ గ్రూపుల్లోకి చేర్చి ఓ ఐటీ ఉద్యోగిని సైబర్ మోసగాళ్లు రూ.19. లక్షలు మోసం చేశారు. ‘నువామా హెచ్ఎన్డబ్ల్యూ ఇన్స్టిట్యూషనల్ అకౌంట్‘ పేరుతో నకిలీ ట్రేడింగ్ యాప్ను పరిచయం చేసి, రోజువారీ ట్రేడింగ్లో 10-20 శాతం లాభాలు, ఐపీఓల్లో ఏకంగా 800 శాతం లాభాలు వస్తాయని నమ్మించి ముంచేసి నట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మీరా అయ్యర్ అనే మహిళ మాటలను నమ్మిన బౌరంపేటకు చెందిన 55 ఏళ్ల ఐటీ ఉద్యోగి తొలుత రూ.20 వేలు పెట్టుబడి పెట్టాడు. యాప్లో లాభాలు వచ్చినట్లు చూపారు. దీంతో ఆగస్టు 27న ఆగ్మోంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్లో ఐపీఓలో 2090 షేర్లుకు ఇన్ఫ్లక్స్ మీడియా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతాకు రూ.2.50 లక్షలు, మరో రూ.2.50 లక్షలు ఎస్బీ ఎంటర్పైజ్రెస్ ఖాతాకు బదిలీ చేశాడు. అలా రకరకాల పేర్లతో ఆకర్షించి రూ.93.75 లక్షలు లాభాలు వచ్చినట్లు వర్చువల్గా చూపి మొత్తం రూ.19,64,000 దోచేశారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
రోజువారీ 10 శాతం లాభం అంటూ..
గచ్చిబౌలికి చెందిన 25 ఏళ్ల వ్యక్తికి ఆగస్టు 2న ‘మార్కెట్ ఇన్సైట్స్ కమ్యూనిటీ’ అనే వాట్సాప్ గ్రూపులో అనన్య శ్రీనివాసన్ అనే మహిళ పరిచయమైంది. తనను ఈక్విటీ అనలిస్ట్గా చెప్పుకుంది. ఎక్స్క్లూజివ్ సెక్యూరిటీస్ పేరుతో బల్క్ ట్రేడింగ్, ఐపీఓ, క్యూఐపీలో పెట్టుబడుల ద్వారా భారీ లాభాలు వస్తాయని నమ్మించింది. దీంతో అతడు ఆగస్టు 4న రూ.4లక్షలతో మొదలుపెట్టి పెట్టుబడిని సుమారు రూ.10 లక్షల వరకు పెంచాడు.
యాప్లో రోజుకు 10 శాతం లాభాలు చూపించడంతో మరింత పెట్టుబడులు పెట్టి మోసపోయాడు. మొత్తం ఆరు లావాదేవీల్లో రూ.11,46,211 నికరంగా నష్టం వాటిల్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో ఘటనలో గచ్చిబౌలికి చెందిన 29 ఏళ్ల సాప్ట్వేర్ ఉద్యోగి ఇదే తరహాలో పెట్టుబడులు పెట్టి రూ.3,56,400 కోల్పోయారు. దీంతో బాధితులు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News